సాగుచేస్తే చం‘ధనమే’ !
రాజంపేట : ఎర్రచందనం సాగుచేద్దామంటూ జాతీయ జీవ వైవిధ్య అథారిటీ (ఎన్బీఏ) పిలుపునిస్తోంది. ఎర్రచందనం పరిరక్షణకే రైతుకు ప్రోత్సాహం ఇస్తోంది. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాలకు చెందిన 198 మంది రైతులకు , సాగుదారులతోపాటు ఒక విద్యా సంస్థకు కలిపి మొత్తం రూ.3కోట్లను తాజాగా విడుదల చేసింది. జీవ వనరుల సుస్థిర వినియోగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ నిధులు పంపిణీ చేసినట్లు ఓ అధికారి తెలిపారు.
యాక్సెస్ అండ్ బెనిఫిట్–షేరింగ్లో..
యాక్సెస్ అండ్ బెనిఫిట్–షేరింగ్ (ఏబీఎస్) ఫ్రేమ్వర్క్లో భాగంగా ఈ ఆర్థిక సాయాన్ని అందించారు. లబ్ధిదారుల్లో కడప, తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాలోని 48 గ్రామాలకు చెందిన రైతులు ఉన్నారు. ఈ నిధుల విడుదలలో ఆంధ్రా యూనివర్సిటీ కూడా ప్రయోజనం పొందింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవ వైవిధ్య బోర్డు ద్వారా ఈ నిధుల పంపిణీ జరిగింది.
శేషాచలం, వెలుగొండలోనే అధికం..
ప్రపంచంలోనే అరుదైన ఎర్రచందనం రాయలసీమ ప్రాంతం ఉన్న కొండల్లో మాత్రమే దొరుకుతుంది. ఈ కొండలు దాదాపు 5.5లక్షల హెక్టార్లలో విస్తరించి ఉన్నాయి. చిత్తూరు, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాలో విస్తరించిన శేషాచలం, వెలుగొండ, పాలకొండ, లంకమల, నల్లమల అడవులు, తూర్పు కనుమల్లో ఉన్నాయి. వీటిలో ఎక్కువగా శేషాచలం. వెలుగొండలో మాత్రమే అధికంగా ఎర్రచందనం పెరుగుతోంది. ఈ కొండల్లో యురేనియం, ఐరన్, గ్రాఫైట్, కాల్షియం లాంటి వివిధ నిష్పత్తుల్లో ఉన్నాయి.
2015లో ఎన్బీఏ ఏర్పాటు..
ఎర్రచందనంపై 2015లో ఎన్బీఏ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సిఫారుసుల మేరకు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఈ కమిటీ సూచనల ఫలితంగానే 2019లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ గ్రేడ్ (డీజీఎఫ్టీ) సాగుచేసిన ఎర్రచందనం ఎగుమతికి అనుమతిస్తూ విధానపరమైన సడలింపులు ఇచ్చింది. జీవ వైవిధ్య పరిరక్షణను లాభదాయకమైన జీవనోపాధిగా మార్చవచ్చని ఈ కార్యక్రమం నిరూపిస్తోంది. స్ధానిక ప్రజల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఎన్బీఏ ముందుకెళుతోంది.
ఎర్రచందనం అనే పేరు ఎలా..
ఎర్రచందనాన్ని అనేక పేర్లతో పిలుస్తారు. టెరోకార్పస్సాంటలైనస్ అనేది దీని శాసీ్త్రయ నామం. టెరో అనే గ్రీకు మాటకు ఉడ్(కర్ర) అని అర్థం. కార్పస్ అంటే పండు. దాని కాయ చాలాగట్టిగా ఉంటుంది. సాధారణంగా అది మొలకెత్తదు. అది మొక్క రావాలంటే ఏడాది పడుతుంది. దీన్నే ఎర్రచందనం రక్తచందనం, శాంటాలం. ఎర్రబంగారం అని కూడా అంటారు. ఇది ప్యాటేసి వర్గానికి చెందిన మొక్క. దీని దుంగ ఎర్రగా ఉండటం వల్ల ఎర్రచందనం అంటారు.
డిమాండ్ ఎందుకు..
చైనా, జపాన్లలో వంటింట్లో వాడే పాత్రలు, గిన్నెలు కూడా ఎర్రచందనంతో చేసినవి వాడుతుంటారు. సంగీత వాయిద్యాలు తయారు చేసి పెళ్లిళ్లలో బహుమతిగా ఇస్తుంటారు. చైనా, జపాన్తోపాటు రష్యా వాళ్లు కూడా ఎర్రచందనం కొనుగోలు చేస్తుంటారు. అందులో ఔషధ గుణాలు ఉన్నాయి. వయాగ్రా, కాస్మొటిక్, ఫేస్ క్రీమ్ లాంటి వాటిలో వీటిని వాడతారు. అల్సర్ను తగ్గించే గుణం, కిడ్నీ సమస్యలు, రక్తాన్ని శుద్ధి చేయడం వంటి లక్షణాలు ఎర్రచందనంలో ఉంటాయని నిపుణులు అంటున్నారు.
ఒక్కో రైతుకు రూ.33 లక్షల నుంచి రూ.22లక్షల వరకు..
వినియోగదారులకు సరఫరా చేసిన ఎర్రచందనం కలప పరిమాణాన్ని బట్టి ఒక్కో రైతుకు రూ.33వేలు నుంచి గరిష్టంగా రూ.22లక్షల వరకు ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. అమ్మకం ద్వారా వచ్చిన విలువ కంటే లబ్ధిదారులు అధిక మొత్తంలో ప్రయోజనం పొందుతున్నారని అధికారులు పేర్కొంటున్నారు. ఎర్రచందనం పరిరక్షణకు, రైతులకు ప్రోత్సాహం అందించేందుకు ఎన్బీఏ ఈ చర్యలు చేపట్టింది.
గతంలో...
గతంలో కూడా ఎన్బీఏ భారీగా నిధులను విడుదల చేసింది. ఎర్రచందనం సంరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, అటవీశాఖలు ఏపీ రాష్ట్ర జీవ వైవిధ్య బోర్డు కిలిపపి రూ.48కోట్లు, తమిళనాడు రైతులకు రూ.55 లక్షలు అందజేసింది.
ఎర్రచందనం దుంగలు
ఎర్రచందనం చెట్లు
ఎర్రచందనం పరిక్షణకే రైతుకు ప్రోత్సాహం
బయో డైవర్సిటీ బోర్డు చేయూత
రూ.3 కోట్లు నిధులు విడుదల చేసిన ఎన్బీఏ
రైతుకు రూ.33 లక్షల నుంచి
రూ. 22 లక్షల వరకు సాయం
సాగుచేస్తే చం‘ధనమే’ !


