
ఆర్ఎంపీ క్లినిక్, ల్యాబ్ సీజ్
మైదుకూరు : ఛాతీనొప్పితో వచ్చిన మహిళకు చేసిన వైద్యం వికటించి మృతి చెందడానికి కారణమైన ఆర్ఎంపీ క్లినిక్, ల్యాబ్ను వైద్య శాఖ అధికారులు శుక్రవారం సీజ్ చేశారు. మైదుకూరు పట్టణంలోని కడప రోడ్డుకు చెందిన ఓ మహిళ గురువారం మధ్యాహ్నం ఛాతీనొప్పితో బాధపడుతూ అదే రోడ్డులోని మెడికల్ షాప్ నిర్వాహకుడు వద్దకు వెళ్లారు. ఆయన చేసిన వైద్యం వికటించడంతో మహిళ మృతిచెందిన విషయంపై సాక్షి దినపత్రికలో వార్త ప్రచురితం కావడంతో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ మల్లేష్, జిల్లా డెమో ఆఫీసర్ భారతి, వైద్యాధికారులు ఎంవీఆర్ మెడికల్ స్టోర్ను తనిఖీ చేశారు. షాప్ నిర్వాహకుడు అనుమతులు లేకుండా ఆర్ఎంపీగా క్లినిక్, ల్యాబ్ను నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్నారు. అనంతరం డీఎంహెచ్ఓ నాగరాజు ఆదేశాలతో మెడికల్ షాప్, క్లినిక్ను సీజ్ చేసి డ్రగ్ కంట్రోల్ విభాగం అధికారులకు ఫిర్యాదు చేశామని డెమో అధికారి భారతి తెలిపారు. ఈ తనిఖీల్లో మెడికల్ ఆఫీసర్ ఎస్.అయేషా, డిస్ట్రిక్ట్ లీగల్ కన్సల్టెంట్ ఎం.పాలేశ్వరరావు, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు ఎం.మరియాకుమారి, ఆర్.వెంగళరెడ్డి, టి.జయప్రకాష్, కె.వీరాంజనేయులు, డి.వెంకటేశ్వర్లు, ఏఎన్ఎం యశోద పాల్గొన్నారు.
విద్యుత్ షాక్తో యువకుడు మృతి
జమ్మలమడుగు రూరల్: మండలానికి చెందిన వల్లెపు రాంబాబు (40) శుక్రవారం సాయంత్రం విద్యుత్ షాక్కు గురై మృతి చెందారు. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. మండలంలోని భీమరాయుని కొట్టాల గ్రామానికి చెందిన వల్లెపు రాంబాబు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి వెళ్లాడు. తిరిగి వచ్చి ఫోన్ తీసే క్రమంలో ప్లగ్ ఊడి వచ్చింది. దీంతో విద్యుత్ షాక్కు గురై మృతి చెందినట్లు భార్య వల్లెపు రూపావతి తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నట్లు తెలిపారు.
తీగలు తగిలి గేదెలు..
వల్లూరు : మండలంలోని భాకరాపురం గ్రామంలో విద్యుత్ తీగలు తగిలి రెండు గేదెలు మృతిచెందినట్లు బాధిత రైతు తెలిపారు. గురువారం రాత్రి కురిసిన గాలి వానకు బాకరాపురం సమీపంలోని పొలాల్లో విద్యుత్ లైన్లు తెగి నేలమీద పడ్డాయి. శుక్రవారం ఉదయం పది గంటల సమయంలో గ్రామానికి చెందిన టి.నాగేశ్వర్రెడ్డి తన గేదెలను మేపడానికి పొలానికి తీసుకువెళ్లాడు. పొలంలో తెగి పడిన తీగలు రెండు గేదెలకు తగలడంతో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందాయి. మిగిలిన గేదెలను పక్కకు తోలడంతో అవి సురక్షితంగా బయటపడ్డాయి. సుమారు లక్షన్నర రూపాయల విలువ చేస్తుందన్నారు. పరిహార ం ఇచ్చిఆదుకోవాలని రైతు కోరారు.

ఆర్ఎంపీ క్లినిక్, ల్యాబ్ సీజ్