
టెట్.. టెన్షన్
బోధన కుంటుపడే ప్రమాదం
రాజంపేట టౌన్: పిల్లలకు పాఠాలు బోధించి పరీక్షలు నిర్వహించే గురువులకే ఇప్పుడు పరీక్ష పాస్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగంలో చేరిన ఉపాధ్యాయులంతా తాజాగా టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) రాయాల్సిందేనని తాజాగా సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పైగా రెండేళ్లలోపు పాస్ కావాల్సిందేనని నిబంధనతో గురువులు ఆందోళన చెందుతున్నారు. సీనియర్ టీచర్స్లో కలవరం మరింత ఎక్కువైంది. విద్యాహక్కు చట్టం 2010 ప్రకారం ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి. అందువల్ల 2010 నుంచి ఉపాధ్యాయ పోస్టులు పొందిన వారంతా టెట్ ఉత్తీర్ణత సాధించినవారే. అయితే 2010వ సంవత్సరంకంటే ముందు కేవలం డీఎస్సీలో మాత్రమే ప్రతిభ చూపి ఉపాధ్యాయ పోస్టులు పొందారు. 2010 కంటే ముందు ఉపాధ్యాయ పోస్టులు సాధించిన వారు జిల్లాలో వేల సంఖ్యలోనే ఉన్నారు.ఇదిలావుంటే ఐదు సంవత్సరాలలోపు పదవీ విరమణ పొందే వారు మినహా మిగతా వారు 2027 ఆగస్టు 31వ తేదీలోపు టెట్ ఉతీర్ణత సాధించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఒకవేళ ఆలోగా టెట్లో ఉత్తీర్ణత సాధించకుంటే ఉద్యోగం వదులుకోవాలని తీర్పులో వెల్లడించింది. దీంతో వేలాది మంది ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
● ప్రస్తుతం ఉపాధ్యాయులపై బోధనేతర పనులు ఎక్కువయ్యాయి. కుటుంబ బాధ్యతలు ఉంటాయి. దీంతో టెట్కు ప్రిపేర్ అయ్యేందుకు సమయం ఉండదని టీచర్లు ఆందోళన చెందుతున్నారు.
పునరాలోచించాలి
2010 కంటే ముందు ఉపాధ్యాయ పోస్టు పొందిన వారు టెట్ ఉత్తీర్ణత సాధించాలని ఇచ్చిన తీర్పుపై పునరాలోచించాలి.రెండు, మూడు దశాబ్దాలుగా పనిచేసే ఉపాధ్యాయులు వృత్తిపరంగా ఎప్పటికప్పుడు అనేక శిక్షణలు పొందుతున్నారు. అందులో భాగంగా ఇన్సర్వీస్, రెసిడెన్షియల్, ఆన్లైన్ వంటి శిక్షణలు పొందారు. అందువల్ల టెట్ ఉత్తీర్ణత సాధించాలన్న నిబంధన సరి కాదు.
–వై.సుబ్రమణ్యంరాజు, ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు
మానవీయ కోణంలో పరిశీలించాలి
టెట్ ఉత్తీర్ణ సాధించాలన్న తీర్పును అత్యున్నత న్యాయస్థానం మానవీయ కోణంలో పరిశీలించాలి. ఎందుకంటే చాలా మంది ఉపాధ్యాయులకు కుటుంబానికి సంబంధించిన బాధ్యతలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కొందరు తమ తల్లిదండ్రుల ఆరోగ్యం వంటి వాటిని చూసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల టెట్కు ప్రిపేర్ అయ్యేందుకు సమయం ఉండదు. వీటిని సుప్రీం కోర్టు పరిగణలోకి తీసుకోవాలి.
–హేమ, పీఎస్హెచ్, భువనగిరిపల్లె, రాజంపేట మండలం
రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి
ఇర్సర్వీస్ ఉపాధ్యాయులు టెట్ ఉత్తీర్ణత సాధించాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. త్వరలోనే టెట్ పరీక్ష నిర్వహణకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. అందువల్ల ప్రభుత్వం ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష ఉత్తీర్ణత నుంచి మినహాయింపు ఇచ్చే విధంగా జీఓ జారీ చేయాలి. –బిళ్ళా హరిప్రసాద్, యూటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు
సుప్రీంకోర్టు తీర్పు వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో బోధన కుంటుపడే ప్రమాదం ఉందని విద్యావంతులు, మేధావులు అంటున్నారు. రెండేళ్లల్లో టెట్ ఉత్తీర్ణత సాధించక పోతే ఉద్యోగం వదులుకోవాల్సి ఉండటంతో ఉపాధ్యాయులు టెట్ ఉత్తీర్ణతపైనే దృష్టిసారిస్తారు. పాఠశాలలోనే ప్రిపేర్ అయ్యే అవకాశం లేకపోలేదు. అందువల్ల బోధన కుంటుపడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ప్రభుత్వం విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణల వల్ల రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య లక్షల్లో తగ్గింది. అయితే ఉపాధ్యాయులు టెట్ ఉత్తీర్ణతపైనే దృషిసారిస్తే బోధన మరింత కుంటుపడి తద్వారా ప్రభుత్వ పాఠశాలల ఉనికికే ప్రమాదం ఉంటుందని విద్యావంతులు, మేధావులు అంటున్నారు.
టీచర్లను కలవరపెడుతున్న సుప్రీంకోర్టు తీర్పు
రెండేళ్లలో టెట్ పాస్ కాకపోతే పదోన్నతులు కరువే
తీర్పుపై పునరాలోచించాలంటున్న ఉపాధ్యాయులు

టెట్.. టెన్షన్

టెట్.. టెన్షన్

టెట్.. టెన్షన్