
దుబాయి కరెన్సీ అంటూ దగా
● చిత్తు కలర్ పేపర్ల చుట్ట చేతిలో పెట్టారు
● రూ.4.5 లక్షలు దోచుకున్న దుండగులు
రాయచోటి టౌన్ : గతంలో నకిలీ బంగారం పేరుతో మోసం చేసిన మాయగాళ్ల గురించి విన్నాం.. వాటిపై నిఘా పెరిగిందనుకున్నారో.. ఏమో ఇక విదేశీ కరెన్సీ అంటూ ఎరవేసి దగా చేస్తున్నారు. రాయచోటిలో చోటు చేసుకున్న ఈ సంఘటనే ఇందుకు అద్దం పడుతోంది. రాయచోటి అర్బన్పోలీస్ స్టేషన్లో డీఎస్సీ కృష్ణ మోహన్ విలేకరులకు మంగళవారం వివరాలు వెళ్లడించారు. ఢిల్లీకి(వాయువ్య ఢిల్లీ) చెందిన హారూన్, తూర్పు ఢిల్లీకి చెందిన మిరాజ్, మధ్య ప్రదేశ్ రాష్ట్రం జబల్పూర్కు చెందిన నూర్ మహమ్మద్ ఖాన్లు రాయచోటిలో మకాం వేశారు. పట్టణంలోని షాపుల వద్దకు వెళ్లి వారితో( హిందీ మాట్లాడే వారితోనే) మాటా మాటా కలుపుతారు. పరిచయం పెంచుకొని తాము వ్యాపారం నిమిత్తం ఇక్కడికి వచ్చామని.. తమ వద్ద దుబాయ్ దేశానికి చెందిన కరెన్సీ( దిర్హం) నోట్లు ఎక్కువ ఉన్నాయని చెబుతారు. నమ్మించడానికి ఒకటి.. రెండు చూపిస్తారు. 100 దిర్హం నోటు ధర ఇండియన్ కరెన్సీ నోట ధర ప్రకారం రూ.2400 పలుకుతున్నట్లు నమ్మిస్తారు. వీరు కూడా ఆన్లైన్ ద్వారా కానీ ఇతరుల ద్వారా కానీ విచారణ సాగించి నమ్ముతారు. శాంపిల్గా ఇచ్చిన నోట్లు ఒరిజనల్వే కావడంతో దుకాణదారులు నమ్మారు. అంతేగాక తమ వద్ద ఎక్కువ నోట్లు చూస్తే సమస్య వస్తుందని, నోటు తీసుకుంటే దిర్హం రూ.1000కే దుండగులు దుకాణదారులను నమ్మించారు. దీనిని నమ్మిని ఒక వ్యక్తి రూ.4.5 లక్షలు నగదు ఇచ్చాడు. రాయచోటి రింగ్ రోడ్డు వద్దకు రమ్మని చెప్పి స్థానికుడి నుంచి రూ.4.5లక్షలు నగదు తీసుకొని ఆ వ్యక్తికి దుబాయ్ నోట్ బయటికి కనిపించే విధంగా టవల్ మధ్యలో కలర్ పేపర్లు ఉంచి ఒక చుట్ట చుట్టి వారికిచ్చి అక్కడ నుంచి పారిపోయారు. మూట తెరిచి చూడగా అందులో పూర్తిగా రంగు రంగుల పేపర్లు చుట్టి ఉండడంతో దుకాణదారు లబోదిబో మంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడని డీఎస్పీ చెప్పారు. అర్బన్ సీఐ బివి చలపతి, ఎస్సై బాలకృష్ణ, స్పెషల్ పార్టీ సిబ్బంది శ్రీను, మల్లిఖార్జున వేగవంతంగా విచారణ సాగించి రాయచోటి–కడప రోడ్డు సమీపాన అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచారు. విచారణ వేగంగా చేసి నిందితులను పట్టుకున్న అధికారులను జిల్లా ఎస్పీ అభినందించారని, రివార్డు కోసం వారి పేర్లు పంపామని తెలిపారు.