
చేతికొచ్చిన పంటను కోత కోయలేరు.. కోసి మార్కెట్కు తరలిస్
మైదుకూరు : జిల్లాలో ఉల్లి (పెద్ద బళ్లారి) పంటను సాగుచేసిన రైతులు కుదేలయ్యారు. అసలే గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న రైతులను గోరుచుట్టుపై రోకటి పోటులా వర్షాలు చుట్టుముట్టి దిక్కుతోచని స్థితిలో పడవేశాయి. జిల్లాలో మైదుకూరు, దువ్వూరు, వీరపునాయునిపల్లె, బ్రహ్మంగారిమఠం, ఖాజీపేట, చాపాడు, పులివెందుల తదితర మండలాల్లో 16,668 ఎకరాల్లో రైతులు ఉల్లి పంటను సాగు చేశారు. పంట చేతికి వచ్చే సమయానికి ఉల్లి ధర అమాంతం పడిపోవడంతో రైతుల ఆశలు నేలపాలయ్యాయి. ప్రస్తుతం మార్కెట్లో క్వింటాల్ ధర రూ. 400 – 500 మాత్రమే పలుకుతోంది. ఎకరాకు రూ. లక్ష పెట్టుబడి పెట్టిన రైతులు క్వింటాల్ ధర పాతాళానికి పడిపోవడంతో తల్లడిల్లిపోతున్నారు. ఆఖరికి పంట కోత కోసి విక్రయించడానికి అయ్యే ఖర్చులు కూడా రాకపోవడంతో చాలామంది రైతులు పంటను పొలాల్లోనే వదిలేస్తున్నారు. వీరపునాయని పల్లె మండలంలో వర్షాలకు పంట మునిగిపోయి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మైదుకూరు, దువ్వూరు మండలాల్లో పొలాల్లోనే వదిలేసిన ఉల్లి పంటను గొర్రెలు మేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
రైతుల కష్టాలపై స్పందించని కూటమి ప్రభుత్వం
గిట్టుబాటు ధర లేక కుదేలైన ఉల్లి రైతుల కష్టాలపై కూటమి ప్రభుత్వం స్పందించకపోవడంపై కర్షకులు కన్నెర్ర చేస్తున్నారు. రైతుల నుంచి క్వింటాల్ రూ.1200 తో కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన అధికారులు ఆచరణలోకొచ్చేసరికి చేతులెత్తేశారు. ఇంతవరకు కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఊసే లేదు. గిట్టుబాటు ధర లేకపోవడం, వర్షాలతో పంట దెబ్బ తినడంతో ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు హెక్టారుకు రూ.50 వేలు పరిహారం చెల్లిస్తామని చంద్రబాబు ప్రకటించారు. అది కేవలం కర్నూలు జిల్లాకు మాత్రమే వర్తిస్తుందని తెలియడంతో జిల్లా రైతులు ఆవేదన చెందుతున్నారు. అటు గిట్టుబాటు ధర లేక ఇటు వర్షాలతో పంట దెబ్బతిని తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని జిల్లా ఉల్లి రైతులు కోరుతున్నారు.
గిట్టుబాటు ధర లేక కుదేలైన రైతులు
క్వింటాల్ రూ. 400 – 500కు
పడిపోయిన ధర
పంటనంతా పొలాల్లోనే వదిలేస్తున్న కర్షకులు

చేతికొచ్చిన పంటను కోత కోయలేరు.. కోసి మార్కెట్కు తరలిస్