
వినాయక చవితిలో వెల్లివిరిసిన మత సామరస్యం
రాయచోటి జగదాంబసెంటర్ : రాయచోటి పట్టణంలో మతసామరస్యం వెల్లివిరిసింది. బుధవారం రాయచోటి పట్టణం ఎస్ఎన్ కాలనీలో వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక ప్రతిమ వద్ద ముస్లిం మైనార్టీలు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం హిందూ ముస్లిం సోదరుల ఐక్యత చాటుకుంటూ ఎంతో వైభవంగా ఉత్సవాలు నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ప్రతి పండుగ సమయంలోనూ ఇలా పరస్పరం సహకరించుకుంటూ అన్నదమ్ముల్లా జరుపుకుంటున్నామన్నారు. అలీ, అజీజ్, ఫయాజ్ల సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.