
కమనీయం.. లక్ష్మీనరసింహుడి కల్యాణం
గుర్రంకొండ: మండలంలోని తరిగొండ గ్రామంలో వెలసిన శ్రీలక్ష్మీ నరసింహాస్వామి వారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. శుక్రవారం స్వాతి నక్షత్రంతో పాటు స్వామివారి జన్మదినం కావడంతో టీటీడీ ఆధ్వర్యంలో స్వామివారికి కల్యాణోత్సవం నిర్వహించారు. ఆలయంలో చలువపందిళ్లు, పచ్చని తోరణాలతో వేదికను అందంగా అలంకరించారు. ముందుగా మూలవర్లకు అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు జరిపారు. ముత్యాల తంబ్రాలతో స్వామివారి పెళ్లివేడుక నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య మేళతాళాలతో శాస్త్రోక్తంగా మాంగల్యధారణ కావించారు. రూ.300 చెల్లించి కల్యాణోత్సవంలో పాల్గొన్న దంపతులకు టీటీడీ వారు పట్టువస్త్రాలు, కంకణాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని సేవించుకొన్నారు. కార్యక్రమంలో అర్చకులు కృష్ణరాజ బట్టార్, రాజుస్వామి, గోకుల్స్వాములు పాల్గొన్నారు.