
దగాకోర్ కటింగ్
నాణ్యత ధ్రువీకరణ లేకుండానే బిల్లుల చెల్లింపు!
ఏప్రిల్ నుంచి పుంగనూరు, కుప్పం ఉపకాలువల్లో కాంక్రీట్ లైనింగ్ పనులు జరుగుతున్నాయి. పీబీసీ పనులపై మూడు నెలల్లో నాణ్యతపై కోర్ కటింగ్ తీయని అధికారులు గత వారంలో 200కి పైగా కోర్ కటింగ్లు తీశారని తెలిసింది. ఇంకా కొన్నిచోట్ల కటింగ్లు తీయాల్సి ఉందని సిబ్బంది చెబుతున్నారు. గతనెలలో కుప్పం పనులకు సంబంధించి 264 చోట్ల కోర్ కటింగ్ చేసి నాణ్యత పరిశీలన కోసం తిరుపతిలోని ఎన్ఏబీఎల్కు తరలించారు. వీటి నాణ్యత గ్రేడ్–15 అని వస్తేనే ఒప్పందం మేరకు పనులు సాగుతున్నట్టు లెక్క అని ప్రాజెక్టుకు చెందిన ఓ అధికారి చెప్పారు. ఇంతవరకు ఈ పనులకు సంబంధించి నాణ్యత ధ్రువీకరణ ఇంకా ఇవ్వలేదని క్వాలిటీ కంట్రోల్ అధికారి ఒకరు వెల్లడించారు. అంటే నాణ్యత ధ్రువీకరణ లేకుండానే అధికారులు గుడ్డిగా బిల్లులు చెల్లించారని స్పష్టం అవుతోంది.
● హంద్రీ–నీవా రెండో దశ లైనింగ్ పనుల్లో మరో లోపం
● రూ.162 కోట్లు ఇచ్చేశాక తీరిగ్గా నాణ్యత పరీక్షలకు కోర్ కటింగ్
● పుంగనూరు, కుప్పం ఉపకాలువ లైనింగ్ పనుల్లో ఇష్టారాజ్యానికి నిదర్శనం
● నాణ్యత పరీక్షల తర్వాతే బిల్లులు ఇవ్వాలన్న నిబంధనకు తూట్లు
మదనపల్లె: హంద్రీ–నీవా ప్రాజెక్టు రెండోదశలో భాగంగా పుంగనూరు (పీబీసీ), కుప్పం ఉప కాలువల్లో జరిగిన కాంక్రీటు లైనింగ్ పనుల్లో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. తాజాగా నాణ్యత పరీక్షలు చేయకుండానే బిల్లులు చెల్లించేసిన వైనం బట్టబయలైది. సాధారణంగా పనులు చేశాక వాటి కోర్ కటింగ్లు తీసి ల్యాబ్లో పరీక్షలు నిర్వహించాకే బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే పీబీసీ పనుల్లో ఈ నిబంధనకు నీళ్లొదిలినట్టు తెలుస్తోంది. కాంట్రాక్టు సంస్థకు రూ.కోట్ల బిల్లులు చెల్లించేశాక తీరిగ్గా కోర్ కటింగ్ చేపట్టి వాటి నాణ్యతను పరీక్షించే చర్యలను అధికారులు చేపట్టడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలంలోని కిలోమీటర్ 74 నుంచి చిత్తూరుజిల్లా పెద్దపంజాణి మండలంలోని 207.800 కిలోమీటర్ వరకు పుంగనూరు ఉపకాలువ (పీబీసీ) పనులు రూ.480 కోట్లతో (అందులో పనికి రూ.366 కోట్లు), చిత్తూరుజిల్లా పెద్దపంజాణి మండలం నుంచి కుప్పం వరకు రూ.169 కోట్లతో 90 కిలోమీటర్ల కుప్పం ఉపకాలువలో లైనింగ్ పనులు చేపట్టిన విషయం తెలిసిందే.
రూ.162 కోట్లు చెల్లించేశారు
పుంగనూరు ఉపకాలువ పనులు ఇద్దరు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల పర్యవేక్షణలో సాగుతున్నాయి. 117 కిలోమీటర్ల మేర కాలువ పనులకు సంబంధించి రూ.71 కోట్ల బిల్లులను చెల్లించేశారు. కుప్పం ఉపకాలువకు సంబంధించి ఒక ఈఈ పర్యవేక్షణలో పనులు చేస్తుండగా 90 కిలో మీటర్ల మేర లైనింగ్ పనికి సంబంధించి రూ.91 కోట్ల బిల్లులు చెల్లించారని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఈ బిల్లులను చెల్లించాలంటే ముందుగా కోర్ కటింగ్ జరిగి, అందులో నాలుగు ఇంచుల మందంతో కాంక్రీటు వేశారా లేదా, అందులో నాణ్యత ఉందా లేదా పరీక్షించాలి. అయితే ఇది చేయకుండా కాంట్రాక్టు సంస్థ ఏర్పాటు చేసిన క్యూబుల్లో నాణ్యత పరీక్షలు సొంతంగా నిర్వహించుకుని బిల్లులను చెల్లించినట్టు తెలుస్తోంది. బిల్లులు చెల్లించాక ఇప్పుడు కోర్ కటింగ్లు తీయడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

దగాకోర్ కటింగ్

దగాకోర్ కటింగ్