
కుప్పానికి నీళ్లు తీసుకెళ్తే.. మా పరిస్థితి ఏంటి?
కురబలకోట : హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పానికి మాత్రమే నీళ్లు తీసుకెళితే పరీవాహక ప్రాంత రైతులు, చెరువుల పరిస్థితి ఏమిటని జిల్లాలోని వివిధ మండలాల గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం తుంగావారిపల్లె పరిసర గ్రామాల రైతులు హంద్రీనీవా కాలువ పనుల వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ పాలనలో హంద్రీనీవా నీటి ద్వారా పరీవాహక ప్రాంత చెరువులను నింపడం జరిగిందన్నారు. తద్వారా పంటలు రావడంతో పాటు భూ గర్భజలాలు పెరిగాయన్నారు. బోర్లలో నీటి మట్టం తగ్గకుండా సంరక్షణ జరిగిందన్నారు. ఇప్పుడు హంద్రీనీవా కాలువకు ఎక్కడా చెరువులకు నీళ్లు వెళ్లడానికి వీలు లేకుండా ప్లాస్టింగ్ పనులు చేపట్టడం వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతుందన్నారు. కాలువ చుట్టుపక్కల ఉన్న చెరువులు, పొలాలకు నీళ్లు చేరకపోతే వ్యవసాయం నాశనం అవుతుందన్నారు. చెరువులకు అనుసంధానానికి వీలుగా నీటి గేట్లు ఏర్పాటు చేయకపోవడం వల్ల కేవలం కుప్పానికి మాత్రమే నీళ్లు వెళతాయన్నారు. చెరువులున్న పరీవాహక ప్రాంతాల వారు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు. ‘హంద్రీనీవా కాలువ నీళ్లు మాకూ కావాలి.. కుప్పానికి మాత్రమే పంపితే మేమెలా బతకాలి.. చంద్రబాబు’ అంటూ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాయలసీమకు నీళ్లు అందించాలన్న ఉద్దేశానికి గండికొడుతున్నారన్నారు. ఉదాహరణకు మండలంలోని తుంగావారిపల్లెకి ఎగువున ఉన్న మల్లేశ్వర చెరువు దిగువున ఉన్న రామక్క చెరువు ఆ తర్వాత రంగమ్మ చెరువుకు చుక్క నీరు కూడా వెళ్లే అవకాశం లేదన్నారు. దీనివల్ల అన్ని విధాలా రైతులు నష్టపోతారన్నారు. ఈ విషయమై జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రికి, జిల్లా ఉన్నతాధికారులకు కూడా వినతి పత్రం ఇచ్చినా పట్టించుకోవడం లేదని రైతు నాయకుడు తుంగావరిపల్లె శంకర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. హంద్రీనీవా కాలువను పరిసర ప్రాంత చెరువులకు అనుసంధానం చేయాలని రైతులు డిమాండ్ చేశా రు. కుప్పానికి మాత్రమే నీళ్లు తీసుకెళ్లి కాలువ పరీవాహక ప్రాంతాలను ఎండబెట్టాలని చూస్తే రైతుల ఆగ్రహం చవిచూడక తప్పదని హెచ్చరించారు.
చెరువులకు అనుసంధానం లేకుండా పనులు ఎలా చేస్తారు?
హంద్రీ నీవా పనులపై రైతన్నల ఆగ్రహం