
దరఖాస్తుల ఆహ్వానం
రాజంపేట టౌన్ : జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో చేరేందుకు ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 15వ తేదీలోపు ఆన్లైన్లో రిజిస్టేషన్ చేసుకోవాలని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ జిల్లా కన్వీనర్ సిహెచ్.రామ్మూర్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మూడు ప్రభుత్వ, పన్నెండు ప్రైవేట్ ఐటీఐల్లో వివిధ ట్రేడ్లకు సంబంధించి సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు www.iti.ap.gov.in వెబ్సైట్లో రిజిస్టేషన్ చేసుకోవాలన్నారు. రిజిస్టేషన్ చేయించుకున్న అనంతరం తమకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఐటీఐల్లో సర్టిపికెట్లను వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు. వెరిఫికేషన్ చేయించుకున్న వారు మాత్రమే మెరిట్ జాబితాలోకి వస్తారని తెలిపారు. అభ్యర్థులు ఏ ఐటీఐలో ప్రవేశం కోసం రిజిస్టేషన్ చేసుకుని ఉంటారో అక్కడే ఈనెల 21వ తేదీ వారికి కౌన్సెలింగ్ ఉంటుందని పేర్కొన్నారు.
రైళ్లలో ఆకస్మిక తనిఖీలు
రాజంపేట : జిల్లాలో నడిచే పలు రైళ్లలో శుక్రవారం పోలీసులు, రైల్వేపోలీసులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడు ఆదేశాల మేరకు తనిఖీలు జరిగాయి. చైన్నె–ముంబై మధ్య నడిచే సూపర్ఫాస్ట్ రైళ్ల బోగీలను క్షుణ్ణంగా పరిశీలించారు. గంజాయి,మత్తు పదార్థాల నిర్మూలన, అక్రమరవాణా అరికట్టేందుకు తనిఖీలు చేపట్టారు. డ్రగ్స్పై సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1972కు, 112కు ఫోన్ చేయాలని పోలీసులు తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు.
డిసెంబర్ 13న ప్రవేశ పరీక్ష
రాయచోటి జగదాంబసెంటర్ : జిల్లాలోని మదనపల్లె మండలం వలసపల్లి గ్రామం, రాజంపేట మండలం నరమరాజుపల్లి గ్రామాల్లో ఉన్న శ్రీ జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశం కోసం డిసెంబర్ 13వ తేదీన పరీక్ష నిర్వహించనున్నారు. ఈవిషయాన్ని జిల్లా విద్యాశాఖాధికారి కె.సుబ్రమణ్యం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన 2025–26 విద్యా సంవత్సరం ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఆన్లైన్లో ఈ నెల 29వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
సమాచార హక్కు
కమిషనర్కు ఫిర్యాదు
రాయచోటి టౌన్ : అన్నమయ్య జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంపై సమాచార హక్కు కమిషనర్కు ఫిర్యాదు చేసినట్లు బాలపోగు సంపత్ కుమార్ తెలిపారు. శుక్రవారం రాయచోటిలో సమాచార హక్కు కమిషనర్కు ఫిర్యాదు చేసిన పత్రాలను పత్రికలకు అందజేశారు. సమాచారం కోసం జిల్లా ఎస్పీ కార్యాలయంలో రైట్ ఇన్ఫర్మేషన్ యాక్టు 2005 ప్రకారం సమాచారం ఇవ్వాలని కోరామన్నారు. తాము అడిగిన సమాచారం ఇవ్వకపోవడంతో సమాచార హక్కు కమిషనర్కు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరికీ రూ.307 రావాలి
రాయచోటి టౌన్ : జాతీయ ఉపాధి హామీ పనుల్లో ప్రతి కూలికి కనీసం రూ.307లు వచ్చే విధంగా చూడాలని డ్వామా పీడీ వెంకటరత్నం ఉపాధి హామీ సిబ్బందికి సూచించారు. శుక్రవారం రాయచోటి రూరల్ పరిధిలోని వరిగపాపిరెడ్డి గారిపల్లెలో జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా కుంటలో పూడిక తీత, మామిడి మొక్కల పెంపకం పనులను ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ కూలీలకు కనీస వసతులు కల్పించాలని చెప్పారు. ప్రతి గ్రామ పంచాయతీలో కనీసం 50 ఎకరాల్లో మొక్కల పెంపకం జరిగే విధంగా చూడాలని తెలిపారు.అనంతర కూలీల మస్టర్ను పరిశీలించారు. ఏపీవో రమేష్, టీఏ శ్రీనివాసులు పాల్గొన్నారు.
పీజీ పరీక్షలు ప్రారంభం
కడప ఎడ్యుకేషన్ : యోగి వేమన విశ్వవిద్యాలయం క్యాంపస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కళాశాల అనుబంధ పీజీ కళాశాలల రెండో సెమిస్టర్ రెగ్యులర్ విద్యార్థులకు పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. వైవీయూ రిజిస్ట్రార్ ఆచార్య పుత్తా పద్మ , కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ కేఎస్వీ కృష్ణారావుతో కలసి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. ఇందులో భాగంగా వైవీయూపీజీ కళాశాల కేంద్రాన్ని వారు పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా 653 మంది పరీక్షలకు హాజరు కాగా 21 మంది గైర్హాజరైనట్లు వారు తెలిపారు.

దరఖాస్తుల ఆహ్వానం