రాయచోటి టౌన్: ప్రజల నుంచి సమస్యలను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు నేడు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి తెలిపారు. అన్నమయ్య జిల్లా కేంద్రంలోని రాయచోటితో పాటు అన్ని మండలాల, గ్రామాల, డివిజన్ స్థాయి స్థాయి నుంచి వచ్చే సమస్యలను స్వీకరించి పరిష్కరిస్తామని తెలిపారు. ప్రజలు ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
నూతన నియామకం
మదనపల్లె సిటీ: మదనపల్లె డీవైఈఓ(ఫుల్ అడిషనల్ చార్జి) గా పీలేరు మండల విద్యాశాఖ అధి కారి లోకేశ్వరరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదివరకు మదనపల్లె డీవైఈఓగా ఉన్న కుమార్ను తిరుపతి డీఈఓతో పాటు అదే కార్యాలయం లో అడిషనల్ డైరెక్టర్ గా నియమించారు. దీంతో ఖాళీగా ఏర్పడిన మదనల్లె డీవై ఈఓ స్థానంలో లోకేశ్వరరెడ్డిని నియమించారు.
9న ఊటీకి ప్రత్యేక బస్సు
మదనపల్లె సిటీ: వేసవి సెలవులను పురస్కరించుకుని ఈనెల 9వతేదీన ఊటికి ప్రత్యేక బస్సు సర్వీసు నడపనున్నట్లు ఆర్టీసీ డీఎం అమరనాథ్ ఓ ప్రకటనలో తెలిపారు. 9న ఆర్టీసీ డిపో–2 నుంచి రాత్రి 8 గంటలకు బయలుదేరి బెంగళూరు,మైసూర్ మీదుగా 10వతేదీ తెల్లవారుజామున ఊటీకీ చేరుతుందన్నారు. 11వతేదీ ఉదయం ఊటీ నుంచి బయలుదేరి పైకార షూటింగ్స్పాట్, ముడుమలై ఫారెస్టు, బండిపూర్ ఫారెస్టు మీదు గా మైసూర్ వెళ్లి ప్యాలెస్, జూపార్కు,బృందావన గార్డెన్స్ చూసిన తరువాత అదే రోజు రాత్రి బయలుదేరి 12వతేదీ తెల్లవారుజామున మదనపల్లెకు చేరుకుంటుందన్నారు. చార్జీ రూ.2800గా నిర్ణయించినట్లు చెప్పారు. సూపర్ లగ్జరీ బస్సు సీట్లు 35 ఉంటాయన్నారు. యాత్రకు వెళ్లాలనుకునేవారు ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు డిపో కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
గంగమ్మా.. కాపాడవమ్మా..
లక్కిరెడ్డిపల్లి: గంగమ్మ తల్లీ...వర్షాలు కురిపించి కరుణించి కాపాడవమ్మా అంటూ భక్తులు అమ్మవారిని వేడుకున్నారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా విరాజిల్లుతున్న అనంతపురం గంగమ్మ దేవత ఆలయానికి ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.కొందరు బోనాలు సమర్పించారు.మరికొందరు తలనీలాలు అర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ పూజారులు చెల్లు వంశీయులు భక్తులకు అమ్మవారి దర్శనాన్ని కల్పించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
నేడు, రేపు వ్యవసాయ పరిశోధన మండలి సమావేశం
కడప అగ్రికల్చర్: కడప నగర శివార్లలోని ఊటుకూరు వ్యవసాయ పరివోధన కేంద్రంలో నేడు, రేపు దక్షణ మండలి పరిశోధన , విస్తరణ సలహా మండల సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఏఆర్ఎస్ ప్రధాన శాస్త్రవేత్త ప్రభాకర్రెడ్డి, కృషి విజ్ఞాన కేంద్రం, ఏరువాక కేంద్రం సమన్వయకర్తలు వీరయ్య, అంకయ్యకుమార్లు తెలిపారు. ఈ సమావేశంలో వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాలలోని వ్యవసాయ జిల్లా వ్యవసాయ అధికారులు, సహాయ వ్యవసాయ సంచాలకులు, ఐదు జిల్లాల వ్యవసాయ పరిశోధన, విస్తరణ కేంద్రాల శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులు పాల్గొంటారని వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ చెరుకూరు శ్రీధర్ హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశంలో 2025–26 సంవత్సరానికి చేపట్టబోయే కార్యచరణ, ప్రణాళిక మీద సమీక్ష నిర్వహించడం జరుగుతుందని వారు వెల్లడించారు.
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక