
పచ్చిరొట్టతోనే భూసారం
గుర్రంకొండ : ఖరీఫ్ పంటల సాగుకు సన్నద్ధమవుతున్న ప్రస్తుత తరుణంలో వివిధ రకాల పంటల సాగు చేసే రైతుల కోసం ముందుగా పచ్చిరొట్ట సాగు చేసుకొంటే పొలాలు ఎంతో సారవంతమవుతాయి. తద్వారా భూమిలో భూసారం పెరిగి అధిక పంట దిగుబడులు సాధించవచ్చు. పచ్చిరొట్ట విత్తనాలు ప్రస్తుతం పంపిణీ చేస్తున్నారు. రైతులు వరి, టమాటా, ఇతర కూరగాయల పంటల సాగులో సేంద్రియ ఎరువులను తగు పాళ్లలో భూమికి అందించడంలో పచ్చిరొట్ట ఎంతో ఉపయోగపడుతుంది. మరో 15 రోజుల్లో ఖరీఫ్ పంటల సాగు కోసం రైతులు సన్నద్ధమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో పచ్చిరొట్ట విత్తనాలు సాగు చేసుకోవాలని వ్యవసాయాధికారులు రైతులకు సూచిస్తున్నారు.
పచ్చిరొట్ట ఎరువు వల్ల లాభమేంటంటే..
ఈ రకం ఎరువు వినియోగం వలన భూమి గుళ్లబారుతుంది. అలాగే భూసారం కుడా బాగా పెరుగుతుంది. పొలానికి నీటిని, పోషక పదార్థాలను నిల్వ ఉంచుకొనే శక్తి పెరగడంతో మొక్కల వేర్లకు గాలి, నీరు, పోషకాలు పుష్కలంగా అందుతాయి. జనుము, జీలుగలు, పిల్లిపెసర వంటి పచ్చిరొట్ట విత్తనాలను ఎరువుగా తక్కువ ఖర్చుతోనే పెంచుకోవచ్చు. వీటి ద్వారా భూములు మరింత సారవంతమవుతాయి. భూమిలో ఆమ్ల, క్షార గుణాలను పెంపొందిచడం, మొక్కలకు పోషక పదార్థాల లోపాలు రాకుండా చూసుకోవడంతో పాటు పంట నాణ్యత, దిగుబడులు మెరుగుపడేందుకు ఈ రకం విత్తనాలు ఎరువులుగా వేయడం వలన చీడపీడల బెడద తగ్గుతుంది. పంటలో కలుపు మొక్కలను కూడా నివారించవచ్చు. వర్షపు నీటిని వృథాగా పోనీయకుండా భూమిలో ఇంకేలా చేస్తుంది. పంటలకు మేలుచేసే రకాల సూక్ష్మ క్రిములు భూమిలో వృద్ధి పొందేందుకు ఉపయోగపడుతుంది. పప్పుజాతి పచ్చిరొట్ట పైరు వల్ల భూమిలో నత్రజనిని స్థిరీకరించి భూసారం పెంపొందించవచ్చు.
పచ్చిరొట్ట విత్తన ఎరువుల్లో ఎంపిక..
పచ్చిరొట్ట పైరు బాగా పెరిగి, ఆకులు ఎక్కువగా కాండం వచ్చి మొత్తగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా వీలైనంత వరకు లెగ్గింగ్ జాతి మొక్కలను పెంచడం వలన పైర్లపైన నత్రజని బుడిపెల ద్వారా గాలిలో నత్రజని స్థిరీకరిస్తాయి. ఇవి త్వరగా కుళ్లిపోయే ప్రభావం కలిగి ఉంటాయి. ఇవి అన్ని రకాల నేలలకు అనుకూలంగా ఉండడంతో పాటు నీటి ఎద్దడి తట్టుకొని పెరుగుతుంది. పచ్చిరొట్ట పైర్ల వేర్లు భుమిలోకి త్వరగా చొచ్చుకొని పోయే గుణం కలిగి ఉంటాయి.
సేంద్రియ కర్బనం లోపం సవరించుకొంటేనే..
సేంద్రియ కర్బనం లేకపోవడం వరి పంటకు శాపంగా మారుతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వర్షపాతంలో వస్తున్న మార్పులు పంట అవశేషాల్ని తొలగించడం లేదా కాల్చేయడం, భూమికోతకు గురికావడం సరైన యాజమాన్య పద్ధతులు పాటించక పోవడం ఇవన్నీ సేంద్రియ కర్బన లోపానికి కారణాలే. భూమిలో సేంద్రియ కర్బనాన్ని పెంపొందించుకోవడానికి పచ్చిరొట్ట ఎరువు విత్తనాలు సాగుచేసుకోవడమే ఉత్తమమైన మార్గం.
సేంద్రియ కర్బనం పెంచుకోవడానికి..
జీలుగల సాగు :
పచ్చిరొట్ట ఎరువులు సాగు చేసుకొంటే భూమికి అవసరమైన సేంద్రియ పదార్థాలను అందిస్తాయి. పచ్చిరొట్ట ఎరువుల విత్తనాల్లో భాగమైన జీలుగలు ఎకరానికి 12 నుంచి 15 కిలోలు వేసుకోవాలి. పూతదశలో కోసినప్పుడు ఎకరానికి 5 నుంచి 6 టన్నుల పచ్చిరొట్ట ఎరువు వస్తుంది. ఒకటన్ను జీలుగ సాగులో 5 కిలోల నత్రజని,1.5 కిలోల భాస్వరం, 4 కిలోల పొటాష్ వస్తుంది. ఇది చౌడు భూములకు బాగా పనికొస్తుంది.
జనుములు :
ఎకరానికి 20 నుంచి 25 కిలోల విత్తనాలు కావాలి. పూత దశకంటే పంట వేసిన ఎనిమిది వారాల తరువాత కోసినప్పుడు 6 నుంచి 8 టన్నుల పచ్చిరొట్టను ఇస్తుంది. ఒక టన్ను జనుములో 4కిలోల నత్రజని, ఒక కిలో భాస్వరం, 3 కిలోల పొటాష్ ఉంటుంది.
పిల్లిపెసెర సాగుతో..
ఎకరానికి 6 నుంచి 8 కిలోల విత్తనం వేసుకోవాలి. పూతదశలో 4 నుంచి 5 టన్నుల పచ్చిరొట్టను ఇస్తుంది. దీన్ని పశుగ్రాసంగా కూడా వాడవచ్చు. ఒకటన్ను పిల్లిపెసెరలో 4కిలోల నత్రజని, కిలో భాస్వరం, 3కిలోల పొటాష్ ఇస్తుంది. ఈ పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలు చల్లుకోవడం వలన భూముల్లో సేంద్రియ కర్బనం పెంపొంది వాటికి సహజసిద్ధమైన భూసారం వస్తుంది.
సేంద్రియ ఎరువుతో భూమికి పోషకాలు
భూసారం పెరుగుతుంది..
పచ్చిరొట్ట విత్తనాలు చల్లుకోవడం వలన పంట పొలాల్లో భూసారం పెరుగుతుంది. సేంద్రియ ఎరువుల గుణం భూమిలో ఎక్కువగా ఉంటుంది. తద్వారా స్వచ్ఛమైన, ఆరోగ్యానికి మేలు చేసే పంట దిగుబడులు సాధించవచ్చు. – వాణిశ్రీ, ఏడీఏ, వాల్మీకిపురం

పచ్చిరొట్టతోనే భూసారం