
తాళ్లపాకలో 9న యోగాంధ్ర కార్యక్రమం
రాయచోటి: తాళ్లపాకలోని అన్నమయ్య సన్నిధిలో ఈనెల 9న యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తొలి తెలుగు వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు, తిరుమలేశునిపై 32వేల సంకీర్తనలు రచించిన అన్నమయ్య నడయాడిన నేలలో ఆయన పేరుతో జిల్లా ఏర్పడిందని కలెక్టర్ తెలిపారు. ఈ ఏడాది మే 9న 617 వసంతాలు పూర్తి చేసుకున్న అన్నమాచార్యుల జయంతిని పురస్కరించుకొని ఆయనను స్మరిస్తూ తాళ్లపాకలోని ఆయన విగ్రహం వద్ద సోమవారం ఉదయం 6 నుంచి 8 గంటల వరకు 617 మందితో యోగాసనాలు వేయనున్నట్లు తెలిపారు. తిరుమలేశునిపై 32వేల సంకీర్తనలు రచించిన అన్నమయ్యకు నివాళిగా జిల్లా వ్యాప్తంగా 32 వేల మందితో యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించే విషయంపై అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. మీడియా మిత్రులు, ప్రజలు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్