
మీ సేవలు చిరస్మరణీయం
రాయచోటి: విధి నిర్వహణలో నిక్కచ్చిగా ఉంటూ సమాజానికి మీరు చేసిన సేవలు చిరస్మరణీయంగా ఉంటాయని జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి అన్నారు. రాయచోటిలోని అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో శనివారం పదవీ విరమణ పొందిన ముగ్గురు పోలీసు అధికారులు, ఒక సీనియర్ అసిస్టెంట్ను ఘనంగా సన్మానించారు. జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు స్థానిక పోలీసు సమావేశ మందిరంలో వారి కుటుంబ సభ్యులు, ఆత్మీయుల సమక్షంలో జిల్లా అదనపు ఎస్పీ ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. తంబళ్లపల్లి పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ ఎ. సుబ్రమణ్యం, జిల్లా స్పెషల్ బ్రాంచ్, ఏఎస్ఐలు నారాయణరాజు, ఎస్.ఉమర్ అలీ, జిల్లా పోలీసు కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ ఎండీ హేమలతలు పదవీ విరమణ పొందిన వారిలో ఉన్నారు. ఉద్యోగంలో చేరి సుదీర్ఘకాలం సమాజానికి సేవ చేసి ఉద్యోగంలో మంచిపేరు ప్రతిష్టలు తెచ్చారని ఏఎస్పీ కొనియాడారు. తమకు ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికి సత్కరించడం తమ జీవితంలో ఎన్నటికీ మరువలేమని జిల్లా అదనపు ఎస్పీకి పదవీ విరమణ పొందిన వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ ఎం.శ్రీనివాసులు, ఏఏఓ జె.త్రినాథ్ సత్యం, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ పి.రాజా రమేష్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు వీజే రామకృష్ణ, ఎం.పెద్దయ్య, ఎస్ఐలు ఆర్ఎస్ఐలు, పదవీ విరమణ పొందిన వారి కుటుంబ సభ్యులు, జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది, పోలీసు సిబ్బంది, మహిళా పోలీసులు, హోంగార్డులు పాల్గొన్నారు.