
బక్రీద్ను శాంతియుతంగా జరుపుకోవాలి
రాయచోటి: ప్రతి ఒక్కరూ ఆచారాల వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన పెంచుకొని మత సామరస్యంతో వ్యవహరిస్తూ జిల్లాలో బక్రీద్ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ తెలిపారు. శనివారం బక్రీద్ను పురస్కరించుకొని శుక్రవారం రాయచోటి కలెక్టరేట్లో జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడుతో కలిసి వివిధ శాఖల అధికారులు, అన్ని మతాల మత పెద్దలతో కలెక్టర్ అధ్యక్షతన శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. మత సామరస్యానికి ప్రతీక అయిన జిల్లాలో ఇటీవల మదనపల్లెలో నిర్వహించిన హనుమాన్ శోభా యాత్ర శాంతియుతంగా జరిగిందని కలెక్టర్ పేర్కొ న్నారు. అదే స్ఫూర్తితో శనివారం బక్రీద్ కూడా ప్రశాంత వాతావరణంలో జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తంచేశారు.జంతువధశాలల వద్ద ప్రభుత్వం సూ చించిన నియమ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలన్నారు. ఆవులు, దూడలు, ఒంటెల వధకు పాల్పడరాదన్నారు. ప్రతి మండలంలో సమావేశాలు ఏర్పాటు చేసి పంచాయతీ, రెవెన్యూ, పోలీసు అధికారులను సమన్వయం చేసుకుంటూ జిల్లాలో బక్రీద్ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.
24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు....
జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ బక్రీద్ పండుగ సందర్భంగా ఎక్కడా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని భద్రతా ఏర్పాట్లను చేశామన్నారు. ఇందులో భాగంగా 24/7 ప్రకారం కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి జిల్లా నోడల్ అధికారిని కూడా నియమించినట్లు తెలిపారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోరాదన్నారు. ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో రాత్రి 9 నుంచి ఉదయం వరకు పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ మాట్లాడుతూ స్లాటర్ హౌస్ల వద్ద శానిటేషన్, మంచినీటి సరఫరా, నిరంతర విద్యుత్ సరఫరా చేయాలన్నారు. సమావేశంలో శాంతి కమిటీ సభ్యులు మాట్లాడారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మేఘస్వరూప్, వైఖోమ్ నదియాదేవి, డీఆర్ఓ మధుసూదన్ రావు, అడిషనల్ ఎస్పీలు ఎం వెంకటాద్రి, మనోజ్ రామనాథ్ హెగ్డే జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి హిదాయతుల్లా, శాంతికమిటీ సభ్యులు, అన్ని మతాల మతపెద్దలు పాల్గొన్నారు.
ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించాలి
జిల్లా పరిధిలోని ప్రభుత్వ భూములకు తగిన విధంగా రక్షణ కల్పించాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో సబ్ కలెక్టర్లు, ఆర్డీఓ, తహసీల్దార్లతో రెవెన్యూ అంశాలపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా జీఓఎంఎస్ నంబర్– 30 మార్గదర్శకాల మేరకు అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల ఆక్రమణ రెగ్యులరైజేషన్, రీ సర్వే, ఫ్రీ హోల్డ్ భూములపై తీసుకున్న పీఓటీ కేసులు, 22 (ఏ) భూముల పరిష్కారం తదితర అంశాలపై సమీక్షించారు.
జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్