●జిల్లా టీడీపీలో అసమ్మతి | - | Sakshi
Sakshi News home page

●జిల్లా టీడీపీలో అసమ్మతి

Jun 8 2025 12:56 AM | Updated on Jun 8 2025 12:56 AM

●జిల్

●జిల్లా టీడీపీలో అసమ్మతి

సాక్షి రాయచోటి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన టీడీపీకి సుగవాసి బాలసుబ్రమణ్యం రాజీనామా కలవరపెడుతోంది. అయితే అధికార పగ్గాలు చేపట్టి ఏడాది అవుతన్నా ఇప్పటికీ హామీలు అమలు చేయకపోవడం...ప్రజల సంక్షేమాన్ని విస్మరించిన నేపథ్యంలో గడ్డుకాలం దాపురిస్తోంది. ప్రజల నుంచి ఒకవైపు తిరుగుబాటు అవుతుండగా, మరోవైపు అధికార పార్టీలో ఉండి కూడా రాజీనామా చేయడానికి సైతం నేతలు వెనుకంజ వేయడం లేదు. అన్నమయ్య జిల్లాలో మాజీ ఎంపీ సుగవాసి పాలకొండ్రాయుడు కుటుంబానికి మంచి పట్టు ఉంది. అంతేకాకుండా రాజకీయంగా పేరొందిన కుటుంబం కావడంతో టీడీపీ తరుపున రాజంపేట అసెంబ్లీ సీటును కట్టబెట్టారు. అయితే స్థానిక నాయకులు సహకరించకపోగా, టీడీపీలోని కొంతమంది వెన్నుపోటు పొడవడంతో పరాజయం పాలయ్యారు ఎన్నికల్లో భారీగా ఖర్చు పెట్టుకున్న సుగవాసికి..పరాజయం తర్వాత సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడం, రాజంపేట ఇన్‌చార్జి ప్రకటన చేయకపోగా, పార్టీలో కరివేపాకులా వాడుకున్నారు. అధికారం ఉన్నా పట్టించుకోకపోవడంతో దాదాపు ఏడాది కాలంగా నలిగిపోతున్న జెడ్పీ మాజీ చైర్మన్‌, రాజంపేట టీడీపీ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రమణ్యం రాజీనామా చేయడం సంచలనంగా మారింది.

పట్టించుకోని అధిష్టానం

జిల్లాలోని రాజంపేట నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా గత ఎన్నికల్లో పోటీ చేసిఓడిపోయిన సుగవాసి బాలసుబ్రమణ్యంను తర్వాత టీడీపీ అధిష్టానం పట్టించుకోలేదు. ఓడిపోయిన తర్వాత ఒకటి, రెండుసార్లు నేరుగా వెళ్లి పెద్దలను కలిసినా కూడా మరో వర్గాన్ని ప్రోత్సహించారే తప్ప సుగవాసిని పట్టించుకోలేదు. సుగవాసి ప్రత్యర్థి వర్గమైన జగన్‌మోహన్‌రాజును జిల్లా పార్లమెంట్‌ అధ్యక్షునిగా ప్రకటించారు. కానీ రాజంపేట నియోజకవర్గానికి మాత్రం ఇన్‌చార్జిని ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో అక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా పోటాపోటీగా చేస్తూ సుగవాసిని దెబ్బతీసే ప్రక్రియకు తెరతీశారు. ఏదో ఒక రకంగా సుగవాసి బాలసుబ్రమణ్యంను పొమ్మనకుండానే పొగబెట్టి బయటికి వెళ్లేలా వ్యూహ రచన సాగింది. టీడీపీ అదిష్టానం కూడా తమ్ముళ్లు కొట్టుకుంటున్నా..ఏడాది అయినా కూడా నేటికీ ఇన్‌చార్జిని ప్రకటించలేని పరిస్థితి నెలకొంది.

మంత్రిపై అవినీతి ఆరోపణలు

సంఽధించిన సుగవాసి

జిల్లాలో కూటమి సర్కార్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 సెప్టెంబరు నెలలో నిర్వహించిన మంచి ప్రభుత్వం కార్యక్రమంలో సుగవాసి బాలసుబ్రమణ్యం రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డిపై అవినీతి ఆరోపణలు గుప్పించారు. అక్రమాలు, అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారారని....అంతేకాకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని బహిరంగంగా విమర్శించారు. ప్రత్యేకంగా సమావేశాలు పెడుతూ రాజంపేట, సండుపల్లె, ఒంటిమిట్టలో మంత్రిపై పెద్ద ఎత్తున విమర్శల వర్షంతోపాటు ఆరోపణలు చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. ఇలా మంత్రిపై పెద్ద ఎత్తున దుమారం లేపడంతో కూడా లోలోపల మంత్రి రాంప్రసాద్‌రెడ్డి, సుగవాస్రిప్రత్యర్థి అయిన జగన్‌మోహన్‌రాజును ప్రోత్సహిస్తూ వచ్చారని కార్యకర్తలుగా పేర్కొంటున్నారు. ఏది ఏమైనా టీడీపీలో సుగవాసి బాలసుబ్రమణ్యం రాజీనామా జిల్లాలో తీవ్ర అలజడి సృష్టిస్తోంది.

అధికార పార్టీలో ఉన్నా..అవమానాలు

పొమ్మనకుండా పొగబెట్టి బయటికి పంపిన టీడీపీ అధిష్టానం

మాజీ ఎంపీ పాలకొండ రాయుడు మృతి సందర్భంలోనూ పట్టించుకోని వైనం

జిల్లాకు ముఖ్యమంత్రి వస్తున్నా సుగవాసి రాకుండా అవమానం

రాజంపేట నుంచి పోటీ చేసినా. . ఇన్చార్జి ఇవ్వని టీడీపీ

సుగవాసి బాలసుబ్రమణ్యం బాటలో మరికొంతమంది నేతలు

జిల్లాలో కూటమి శ్రేణుల మధ్య పొసగడం లేదు. ప్రధానంగా టీడీపీలో అన్నిచోట్ల అసమ్మతి రాజుకుంటోంది. వర్గ విబేధాలతో నేతల మధ్య ఆధిపత్య పోరు తారా స్థాయికి చేరింది. ఎవరికి వారు తమ పట్టును నిరూపించుకునేందుకు ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ నేపధ్యంలో అసంతృప్తితో రగిలిపోతున్న అనేకమంది తెలుగు తమ్ముళ్లు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అన్న ఆందోళన టీడీపీని వెంటాడుతోంది. సుగవాసి బాలసుబ్రమణ్యం రాజీనామాతో మరికొంతమంది నేతలు ఈ బాటలోనే పయనించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

జిల్లా కేంద్రమైన రాయచోటిలో ఉంటున్న సుగవాసి కుటుంబానికి జిల్లా వ్యాప్తంగా మంచి పట్టు ఉంది. ఇదే కోవలో రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన సుగవాసి బాలసుబ్రమణ్యం అడుగడుగునా అవమానాలు ఎదుర్కొంటూ వస్తున్నారు. టీడీపీ ఆయనను పొమ్మ నకుండానే పొగబెట్టిందని కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. పార్టీ కోసం మాజీ ఎంపీ కుటుంబం అహర్నిశలు కష్టపడినా ఇప్పుడు మాత్రం అధికారం ఉన్నా అవమానాలు తప్పలేదు. గత ఫిబ్రవరిలో సీఎం చంద్రబాబు సంబేపల్లె పర్యటనకు వచ్చిన సమయంలోనూ సుగవాసి బాలసుబ్రమణ్యంకు కలిసేందుకు అవకాశం ఇవ్వలేదు. ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల సమయంలోనూ ముఖ్యమంత్రి రాజంపేట నియోజకవర్గానికి వచ్చినపుడు కూడా సుగవాసి కుటుంబాన్ని విస్మరించారు. మహానాడుకు టీడీపీ అధిష్టానం నుంచి పిలుపు లేకపోగా, జిల్లా పార్టీ నుంచి కేవలం సుగవాసి కుటుంబీకులైన ఇద్దరికి మాత్రమే పాసులు పంపించారని తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. ఇటీవల మాజీ ఎంపీ పాలకొండ్రాయుడు మృతి చెందిన సమయంలో ఇన్‌చార్జి మంత్రిని పంపించి అధిష్టానం తరుపున పెద్దలు రాకుండా అవమానించారని లోలోన ఆ కుటుంబం మదనపడుతోంది. సుగవాసి పాలకొండ్రాయుడు మృతి చెందే వరకు టీడీపీలోనే ఉంటూ పార్టీని బలోపేతం చేశారు. మంత్రి, మాజీ ఎంపీ, ఎమ్మెల్యేగా ఇలా అనేక హోదాల్లో పనిచేసిన సీనియర్‌ నాయకుడు మృతి చెందిన సమయంలో కూడా టీడీపీ అధిష్టానం పెద్దగా పట్టించుకోకపోగా...మృతి చెందిన తర్వాత వారం, పది రోజుల్లోనే జరిగిన మహానాడులో సైతం సుగవాసి ప్రస్తావన లేకపోవడం వారిలో ఆగ్రహానికి గురి చేస్తోంది.

●జిల్లా టీడీపీలో అసమ్మతి 1
1/1

●జిల్లా టీడీపీలో అసమ్మతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement