విత్తన ఎంపికే కీలకం | - | Sakshi
Sakshi News home page

విత్తన ఎంపికే కీలకం

Jun 8 2025 12:56 AM | Updated on Jun 8 2025 12:56 AM

విత్త

విత్తన ఎంపికే కీలకం

కడప అగ్రికల్చర్‌ : పంటల సాగులో విత్తన ఎంపిక అత్యంత కీలకం. ఇది పంటల దశ, దిశ మార్చడంతో పాటు మంచి దిగుబడులకు దోహదం చేస్తోంది. అలాగే మంచి విత్తన ఎంపిక జరిగితేనే చీడపీడలను తట్టుకుని నాణ్యమైన దిగుబడిని ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. కనుక రైతులు విత్తన ఎంపిక, కొనుగోలులో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకుని అటు వ్యవసాయ అధికారులతోపాటు శాస్త్రవేత్తల సూచనలు, సలహాలను పాటించాల్సి అవసరం ఉంది. ఎందుకంటే విత్తన ఎంపికలో ఏదైనా పొరపాటు జరిగితే పంట సాగు మొదలుకుని దిగుబడి వరకు పెట్టిన పెట్టుబడి ఖర్చుతో రైతుల కష్టం నేలపాలు అవుతుంది. దీంతో రైతన్నలు ఆర్థికంగా చితికిపోతారు. పంటలు సాగుచేసే ముందు విత్తన ఎంపిక తదితర విషయాల్లో రైతులు కచ్చితంగా వ్యవసాయ, శాస్త్రవేత్తల సలహాలను పాటించాల్సి ఉంది.

ప్రారంభమైన ఖరీఫ్‌ సీజన్‌..

ఏడాది ముందస్తు రుతుపవనాల ఆగమనంతో జిల్లాలో వర్షాలు ప్రారంభమయ్యాయి. దీంతో రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు. దుక్కులు ప్రారంభించారు. ఖరీఫ్‌ సీజన్‌ కూడా ప్రారంభమైంది. నదీ పరివాహక ప్రాంతాలతో పాటు వర్షాధారిత ప్రాంతాల్లో కూడా అక్కడక్కడా వేరుశనగను సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది రైతులు ఎక్కడపడితే అక్కడ వరి, వేరుశనగ, జొన్నలు, సజ్జలు, మినుములు, మొక్కజొన్న వంటి విత్తనాలను కొనుగోలు చేస్తుంటారు. ఇలా కొనుగోలు చేసే రైతులు స్థానిక వ్యవసాయ అధికారులు సర్టిఫైడ్‌ చేసిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలి. అలాగే షాపు యజమాని లైసెన్సు ఉందా లేదా అని తెలుసుకోవాలి. కొనుగోలు చేసిన విత్తనాలకు కచ్చితంగా బిల్లులు కూడా అడిగి తీసుకోవాలి. తీసుకున్న విత్తన బిల్లులను పంట దిగుబడి చేతికి వచ్చే వరకు భద్రంగా దాచుకోవాలి. లేకుంటే విత్తన ఎంపికలో ఏదైనా పొరపాటు జరిగితే దిగుబడులు తగ్గి రైతన్నలు నష్టపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిణామాలను మనం పలు చోట్ల చూస్తునే ఉన్నాం. ఈ నేపథ్యంలో వరితోపాటు ఇతర విత్తనాల ఎంపికలో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. విత్తనమే దిగుబడులను నిర్ణయిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

పాటించాల్సిన జాగ్రత్తలు..

● వ్యవసాయశాాఖ నుంచి అనుమతి పొందిన అధీకృత డీలర్ల నుంచి మాత్రమే విత్తనాలను కొనుగోలు చే యాలి.

● విత్తనాల కొనుగోలు సమయంలో డీలర్ల వద్ద తీసుకున్న బిల్లులను పంట కాలం పూర్తయ్యే వరకు భద్రంగా ఉంచుకోవాలి.

● బిల్లుపై విక్రయదారుడి పేరు, రాష్ట్ర అమ్మకపు పన్ను నంబర్‌, విత్తనరకం, గడువుతేదీ, కంపెనీ పేరు, డీలర్‌ సంతకం ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.

● ఎక్కడ కూడా లూజు విత్తనాలు, గడువు దాటిన విత్తనాలను ఎలాంటి పరిస్థితుల్లో కొనుగోలు చేయకూడదు.

● కొనుగోలు చేసే విత్తనాల ప్యాకెట్ల నుంచి సంచిపైన సీల్‌ ఉందా, లేదా అని ముఖ్యంగా చెక్‌ చేసుకోవాలి.

● రైతులు విత్తనాలను కొనుగోలు చేసేటప్పుడు విక్రయదారులు ఇచ్చే కరపత్రాలను తీసుకుని వాటిలో పేర్కొన్న అంశాలు పూర్తిగా చదివి అవగాహన చేసుకోవాలి.

● విత్తనం కొనుగోలు చేసిన వెంటనే పరీక్షించాలి. మొలక శాతం సంతృప్తిగా ఉన్న వాటిని ఎంపిక చేసుకోవాలి.

● మొలకెత్తే సమయం, పూత దశలో పంటలో లోపం కనిపిస్తే వెంటనే వ్యవసాయ అధికారిని సంప్రదించాలి.

విత్తన కొనుగోలులో సరైన జాగ్రత్తలు పాటించాలి

నాణ్యమైన విత్తనాలతోనే అధిక దిగుబడులు

పంట కాలం పూర్తయ్యే వరకు బిల్లులు భద్రం

మొలక శాతం పరీక్షించాలి...

రైతులు ఎవరైనా బయట డీలర్ల వద్ద విత్తనాలను కొనుగోలు చేయాల్సిన పరిస్థితుల్లో లైసెన్సులు ఉన్న డీలర్ల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసిన విత్తనాల మొలకశాతం చెక్‌ చేసుకోవాలి. మొలకశాతం తక్కువగా ఉన్న విత్తనాలను కొనుగోలు చేయవద్దు. మొలకశాతం బాగుంటేనే విత్తనాలను కొనుగోలు చేసుకోవాలి.

– డాక్టర్‌ వీరన్న, ప్రధాన శాస్త్రవేత్త, కో ఆర్డినేటర్‌, కృషి విజ్ఞాన కేంద్రం, కడప

విత్తన ఎంపికే కీలకం1
1/2

విత్తన ఎంపికే కీలకం

విత్తన ఎంపికే కీలకం2
2/2

విత్తన ఎంపికే కీలకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement