
శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తే దండన తప్పదు
రాయచోటి: జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన వారి పట్ల కఠినదండనలు తప్పవని జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడు హెచ్చరించారు. విదేశ పర్యటన అనంతరం జిల్లా తిరిగి వచ్చిన జిల్లా ఎస్పీ జిల్లాలో చేపట్టాల్సిన శాంతిభద్రతలు, జరుగుతున్న దొంగతనాల పట్ల ప్రజల అప్రమత్తత తదితర విషయాలపై ఆదివారం పత్రికలకు అందజేసిన ప్రకటనలో విశదీకరించారు. మీ ఇళ్లు, పరిసర ప్రదేశాల్లో కనిపించే అపరిచితులను గుడ్డిగా నమ్మవద్దన్నారు. అనుమానం ఉన్న వ్యక్తులైతే గుట్టుగా పోలీసులకు తెలియజేయాలన్నారు. విలువైన వస్తువులు, నగలు, డబ్బు ముఖ్యమైన పత్రాలను సురక్షితమైన స్థలంలో ఉంచుకోవాలన్నారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్లు, ఈమెయిల్ల పట్ల జాగ్రత్త వహించాలన్నారు. వ్యక్తిగత సమాచారం లేదా బ్యాంక్ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే గొడవలు, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడవద్దన్నారు. దొంగతనాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి పోలీసులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వేసవి సెలవుల్లో పిల్లలతో సరదాగా తీర్థయాత్రలు, విహారయాత్రలకు వెళ్లడం పరిపాటి. కానీ తాళం వేసి ఉండే ఇళ్లే లక్ష్యంగా దొంగలు విరుచుకుపడి దొరికినంత దోచుకెళ్తారన్నారు. వేసవి దొంగతనాలను నివారించేందుకు జిల్లా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. తాళం వేసి ఉన్న ఇళ్లలో దొంగతనాలకు పాల్పడే వారి ఆటలు కట్టించేందుకు నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేశామన్నారు. ప్రజలు కూడా పోలీసుల ఆదేశాలను పాటిస్తూ ఈ వేసవికాలాన్ని సురక్షితంగా సంతోషంగా కుటుంబసభ్యులతో గడపాలని ఎస్పీ తెలిపారు.
నేరాలపై అవగాహన
నేరాల గురించి అవగాహన కల్పించేందుకు వివిధ కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటే దొంగతనాలను నివారించవచ్చని ఎస్పీ ప్రకటనలో పేర్కొన్నారు.
● ఇంటి భద్రతపై సూచనలు
ఇంటి భద్రతకు సంబంధించి ఎస్పీ కొన్ని సూచనలు చేశారు.
● బయటకు వెళ్లే ముందు ఇంటి ప్రధాన, వెనుక ద్వారాలకు తాళాలు, చుట్టూ ఉన్న కిటికీలు మూసివేయడం మర్చిపోకూడదు.
● ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలు కనిపించేలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా అలారం వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి.
● ఇంటి బయట ఎప్పుడూ వెలిగేలా లైట్ ఉండాలి. దీని ద్వారా ఇంట్లో ఎవరూ లేరనే అనుమానం ఎవరికి రాదు. తద్వారా జరిగే దొంగతనాలను నివారించవచ్చు.
● నివాస ప్రాంతాల చుట్టుపక్కల అనుమానాస్పదంగా ఎవరైనా వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమీప పోలీసు వారికి సమాచారమివ్వాలి.
● అపరిచితులను నమ్మకూడదు. వారిని ఇంట్లోకి అనుమతించకపోవడం మరీ మంచిది.
జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడు