ములకలచెరువు : అప్పుల బాధ తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం తెల్లవారుజామున మండలంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం మేరకు.. చిత్తూరు జిల్లా గంగవరం మండలం మారూడుగుకు చెందిన గజ్జెల బాలసుబ్రమణ్యం(31)కు భార్య నవనీత్, ఇద్దరు పిల్లలు సంతానం. ఇతను మండలంలోని కాలువపల్లె సమీపంలోని ఒక కోళ్లఫారంలో పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇక్కడికి రాకముందే అప్పులు ఉండేవన్నారు. ఇక్కడ నెలకు రూ.21 వేలు మాత్రమే వచ్చేవని.. కుటుంబాన్ని పోషించడానికే డబ్బులు సరిపోతున్నాయని... అప్పులు తీర్చేదెలా అంటూ అప్పుడప్పుడు బాధపడుతుండేవాడని తెలిపారు. డబ్బులు నిదానంగా సంపాదించుకొని అప్పులు తీర్చుకోవచ్చని భార్య నవనీత్, బాలసుబ్రమణ్యం అన్నయ్య గంగాధర్ అనేక సార్లు చెప్పారన్నారు. మనస్థాపానికి గురైన బాలసుబ్రమణ్యం తెల్లవారుజామున కోళ్లఫారంలో ఉరి వేసుకున్నాడు. కోళ్లఫారంలో ఉన్న వారు గమనించి సమీపంలోని సత్యసాయి జిల్లా ఎన్పీ కుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. భార్య, అన్నయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ భాస్కర్ నాయక్ తెలిపారు.
విద్యుత్ షాక్తో
లారీ డ్రైవర్ మృతి
లింగాల : విద్యుత్ షాక్తో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన ఫరూక్ అహమ్మద్(60) అనే లారీ డ్రైవర్ మృతి చెందాడు. ఎస్ఐ మధుసూదన్రావు కథనం మేరకు.. లింగాలలో అరటి కాయల వ్యాపారి గోడౌన్ సమీపంలో మరో లారీలోకి బాక్సులు మార్చేందుకు విద్యుత్ లైన్ కిందకు వెళ్లడంతో విద్యుత్ వైరు తెగి పడింది. సమీపంలో లారీ డ్రైవర్ ఫరూక్ అహమ్మద్ నీటితో లారీని శుభ్రం చేస్తుండగా విద్యుత్ వైర్లు ఆయనపై పడ్డాయి. తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడని ఎస్ఐ తెలిపారు.