
క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులను పరామర్శించండి
వారిని ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి.. వైఎస్సార్సీపీ నాయకులకు వైఎస్ జగన్ ఆదేశం
వర్షాలు కురుస్తాయన్న సమాచారమున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించిందని ఆగ్రహం
ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించకుండా యంత్రాగమంతా నిస్తేజంలో ఉందని మండిపాటు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలు, ఈదురుగాలుల కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులకు అండగా నిలవాలని.. వారిని పరామర్శించి ధైర్యం చెప్పాలని వైఎస్సార్సీపీ నాయకులను ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. అందుబాటులో ఉన్న రీజనల్ కోఆర్డినేటర్లు, పార్టీ ముఖ్య నాయకులతో ఆయన ఫోన్లో మాట్లాడారు. అకాల వర్షాలు, ఈదురుగాలుల వల్ల రాష్ట్రంలో పలుచోట్ల ధాన్యం తడిసిపోవడంతో పాటు ఉద్యానవన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. వర్షాలు కురుస్తాయన్న సమాచారం ముందస్తుగానే ఉన్నప్పటికీ.. కల్లాల్లో, పొలాల్లో రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిందని.. అధికార యంత్రాంగం మొత్తం నిస్తేజంలో ఉందని వైఎస్ జగన్ మండిపడ్డారు.
ఖరీఫ్లో ప్రతికూల వాతావరణం, కనీస మద్దతు ధరలు లభించక తీవ్ర ఇబ్బందులు పడిన వరి రైతులు.. ఈ రబీ సీజన్లో కూడా కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు సహా పలు చోట్ల ప్రభుత్వం ధాన్యాన్ని సరిగ్గా సేకరించకపోవడంతో రైతులు ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. ఇప్పుడు అకాల వర్షాల వల్ల మరింతగా నష్టపోతున్నారని వైఎస్ జగన్ అన్నారు. దీంతో పాటు అకాల వర్షాల వల్ల పలు ఉద్యానవన పంటలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు. పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు చేసి.. రైతులకు బాసటగా నిలవాలని, వారిని ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆదేశించారు.
