మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ 1,04,11,136 సంతకాల పత్రాలు అందజేత
ఉదయం 10 గంటలకు జెండా ఊపి ఆ పత్రాలున్న వాహనాలను లోక్భవన్కు పంపనున్న జగన్
ఆ తర్వాత పార్టీ నేతలతో సమావేశం
అనంతరం గవర్నర్తో భేటీ
సాక్షి, అమరావతి: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమంలో భాగంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సాయంత్రం 4 గంటలకు గవర్నర్తో భేటీ కానున్నారు. పార్టీకి చెందిన జిల్లా అధ్యక్షులు, శాసనసభ్యులు, ఎంపీలు, తదితరులతో కలిసి ఆయన గవర్నర్కు 1,04,11,136 సంతకాల పత్రాలను అందించనున్నారు.
అంతకు ముందు ఉదయం 10 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద కోటి సంతకాల పత్రాలతో వచ్చిన వాహనాలను వైఎస్ జగన్ జెండా ఊపి లోక్భవన్కు పంపనున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, రీజినల్ కో–ఆర్డినేటర్లు, జిల్లాల పార్టీ అధ్యక్షులు, పార్టీకి చెందిన సీనియర్ నాయకులు పాల్గొంటారు.
ఆ తర్వాత వీరితో వైఎస్ జగన్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమవుతారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత గవర్నర్ నివాసం లోక్భవన్కు బయల్దేరి వెళతారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కోటి మందికిపైగా చేసిన సంతకాల పత్రాలతో వాహనాలు ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నాయి.


