సాక్షి,విజయవాడ: రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దేశంలో అతిపెద్ద స్కాం అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన కోటి సంతకాల సేకరణ ప్రతులను గురువారం విజయవాడలోని లోక్భవన్లో గవర్నర్ అబ్ధుల్ నజీర్కు అందించారు. అనంతరం లోక్భవన్ వద్ద వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు.
‘మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో చంద్రబాబు చేస్తున్న అన్యాయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా రాష్ట్ర ప్రజల ఆకాంక్షను కూడా ఆయనకు తెలియజేశాం. ఈరోజు ఒక చారిత్రక ఘట్టం. ఏకంగా 1,04,11,136 సంతకాలు. దేశ చరిత్రలో కూడా ఇలాంటి ఉద్యమం జరిగి ఉండదేమో?. గత అక్టోబరు 7న ప్రజా ఉద్యమ కార్యాచరణ ప్రకటించాం. ఆ తర్వాత అక్టోబరు 10 నుంచి ఈనెల 10 వరకు ప్రతి గ్రామం, పట్టణం, ప్రతి వార్డులో రచ్చబండ కార్యక్రమం ద్వారా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. వారిని ఉద్యమంలోకి తీసుకువచ్చాం. వాళ్ల సంతకాలు తీసుకున్నాం.
నవంబర్ 12న ఒకసారి, మళ్లీ ఈనెల 10న మరోసారి అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు నిర్వహించాం. డిసెంబరు 10న ర్యాలీల తర్వాత కోటి సంతకాల పత్రాలను జిల్లా కేంద్రాలకు తరలించాం. అక్కడ డిసెంబరు 15న ర్యాలీలు నిర్వహించి, వాటిని ప్రజలకు చూపాం. ఆ తర్వాత వాటన్నింటినీ పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించి, ఈరోజు (గురువారం) గవర్నర్కి చూపించాం. ఆ విధంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజల నిరసన, వారి మనోభావాలను వివరించాం.
అసంబద్ధంగా ప్రభుత్వ నిర్ణయం:
ఈరోజు మీ అందరి ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తున్నాను. మనం తీసుకునే నిర్ణయాలు భవిష్యత్ తరాలకు ఎలాంటి ప్రభావం పడుతుందన్నది ఆలోచన చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం స్కూల్స్ ఎందుకు నడుపుతుంది? దేశంలో అన్ని చోట్ల స్కూళ్లు, ఆస్పత్రులు, ఆర్టీసీ బస్సులను ప్రభుత్వమే ఎందుకు నడుపుతుందో ఆలోచించారా? రాష్ట్ర ప్రభుత్వమే వీటిని నడపకపోతే పేద, మధ్య తరగతి వారు ప్రైవేటును ఆశ్రయించలేక నష్టపోతారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని ఒక బాధ్యతగా భావించి నిర్వహిస్తాయి.
ఇలా అన్నీ ప్రైవేటీకరిస్తూ పోతే, దోపిడికి చెక్ పడదు. ప్రజా సేవలు పొందాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఇన్పేషెంట్గా చేరాలంటే కనీసం రూ.5 వేలు ఛార్జ్ చేస్తారు. కనీస వసతుల రూమ్ కావాలంటే రోజుకు రూ.10 వేలు, ఐసీయూలో రోజుకు కనీసం రూ.50 వేలు చెల్లించాల్సి ఉంటుంది. అందుకే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయం.
మెడికల్ కాలేజీతో ఫ్రీగా అత్యుత్తమ వైద్య సేవలు:
మా ప్రభుత్వ హయాంలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాగా చేయడంతో పాటు, ప్రతి జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీకి శ్రీకారం చుట్టాం. ఎక్కడైనా మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తే, అక్కడ టీచింగ్ ఆస్పత్రి అందుబాటులోకి వస్తుంది. అప్పుడు ఆ ఆస్పత్రిలో, మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, నర్సులు అందరూ అందుబాటులో ఉంటారు. దీంతో పేదలకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుతాయి. దాని వల్ల చుట్టుపక్కల ఉన్న ప్రైవేటు ఆస్పత్రులు ఇష్టం వచ్చినట్లు ఛార్జ్ చేయలేవు. మేము నాడు తలపెట్టిన 17 మెడికల్ కాలేజీలు ప్రారంభమైతే, మన పిల్లలకు మరిన్ని మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. దాని వల్ల వైద్య విద్య కోరుకునే పేద విద్యార్థులకు న్యాయం జరుగుతుంది.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ స్కామ్ల మయం:
కానీ, ఇప్పుడు చంద్రబాబు ఆ పని చేయకపోగా, కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిçస్తూ, స్కామ్లు చేస్తున్నారు. స్కామ్ల విషయంలో చంద్రబాబు నాలుగు అడుగులు ఎక్కువ వేస్తున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఒక స్కామ్ అయితే, ఆ తర్వాత రెండేళ్ల పాటు, ఆ కాలేజీల సిబ్బందికి ప్రభుత్వం జీతాలు ఇవ్వడం మరో స్కామ్. అంటే అక్కడున్న భూమి, భవనాలు, పని చేసే వారంతా ప్రభుత్వ ఉద్యోగులు. కానీ, నిర్వహణ మాత్రం ప్రైవేటువారిది. అంటే ఖర్చు ప్రభుత్వానిది. సంపద ప్రైవేటువారికి. ఒక మెడికల్ కాలేజీలో జీతాలు ఏడాదికి కనీసం రూ.60 కోట్లు. రెండేళ్లకు రూ.120 కోట్లు. అంటే ఆ లెక్కన 10 మెడికల్ కాలేజీల సిబ్బందికి రెండేళ్లపాటు జీతంగా కనీసం రూ.1200 కోట్లు అవుతుంది. ఇలాంటి స్కామ్లు దేశంలో ఎక్కడా ఉండవు.
నిధుల కొరత అనేది అబద్ధం:
మా హయంలో ప్రతి చోట 50 ఎకరాలు ఉండేలా 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టాం. వాటికి నాబార్డ్, ఇతర బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ నిధులు టైఅప్ చేశాం. వాటిలో 7 కాలేజీలు పూర్తి చేశాం. అవి ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి. వాటి ద్వారా 800 మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన కాలేజీలు పూర్తి చేసేందుకు ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు అవసరం. రూ.2 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఆ మాత్రం నిధులు ఖర్చు చేయలేదా?.
పోనీ మీరు ఖర్చు చేయలేకపోతే వదిలేయండి. మేం వచ్చాక వాటిని పూర్తి చేస్తాం. చంద్రబాబుకు గట్టిగా తగిలేట్టుగా గవర్నర్ దృష్టికి అన్ని విషయాలు తీసుకెళ్లాం. మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తే, మాకు క్రెడిట్ దక్కుతుందన్న అక్కసుతో చంద్రబాబు పేదలకు నష్టం చేస్తున్నారు. మరోవైపు ప్రైవేటీకరణతో స్కామ్లు చేస్తున్నారు. నిజానికి ఆ మెడికల్ కాలేజీలన్నీ భవిష్యత్లో లక్ష కోట్ల ఆస్తి అవుతాయి. ఇంకా కొన్ని కోట్ల మందికి ఉచిత వైద్యం అందిస్తూ, వెల కట్టలేని సేవలందిస్తూ కోట్లాది మందికి వెలుగులు నింపుతాయి.
అందుకే మా పోరాటం ఆపబోము:
మా ఈ పోరాటం ఇంతటితో ఆగదు. గవర్నర్కి కోటి సంతకాలు చూపించాం. ఇక్కడి నుంచి రేపు కోర్టులో పిటిషన్ వేస్తాం. అక్కడ కూడా ఈ కోటి సంతకాలు చూపిస్తాం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తాం. చంద్రబాబు తోలు మందం కాబట్టి ఆయన మారకపోవచ్చు. కాబట్టి అందరూ కలిసి రావాలి. అందరం కలిసికట్టుగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుందాం. మనం ఇప్పుడు ఆ పని చేయకపోతే, రేపొద్దున వైద్యం కోసం ఒక్కొక్కరు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు చెల్లించాల్సి వస్తుంది. గవర్నర్ కానీ, మనసున్న ఏ వ్యక్తికి కానీ చంద్రబాబు చేసేది తప్పు అని అర్థమవుతుంది. ఇదే గవర్నర్ ఇంట్లో పని చేసే వ్యక్తులు మెడికల్ కాలేజీకి వెళ్తే ఉచితంగా వైద్యం అందుతుంది. గవర్నర్ది మంచి మనసు. ఆయన అన్నీ అర్థం చేసుకున్నారు.
ఈ ప్రభుత్వంలో అన్నీ సున్నా:
మెడికల్ కాలేజీలను కాపాడుకునేందుకు ప్రతి ద్వారం తొక్కుతాం. కోర్టుల ద్వారా వీటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. ఇంకా ఉద్యమమూ కొనసాగుతుంది. ఎందుకంటే ఇది కచితంగా స్కామ్. అన్నీ ప్రభుత్వానివే. అప్పగించేది మాత్రం ప్రైవేటు వ్యక్తులకా?. ఎన్నికల ముందు ఏం చెప్పారు? బిర్యానీ పెడతామని నమ్మించారు. కానీ, ఈరోజు అవేవీ లేవు. చదువుకుంటున్న పిల్లలకు ఫీజు రీయింబర్స్ లేదు. దాంతో వారు చదువులు మానేస్తున్నారు. ఆరోగ్యశ్రీ లేదు. నెట్వర్క్ ఆస్పత్రులకు బకాయిలు ఇవ్వడం లేదు. విశాఖలో మా హయాంలో రిషికొండపై రూ.230 కోట్లతో బ్రహ్మాండమైన బిల్డింగ్ నిర్మిస్తే, అది ఇప్పుడు నగరానికే తలమానికంగా ఉంది. అయినా దానిపై పిచ్చి విమర్శలు చేస్తున్నారు. విశాఖలో ఒకరోజు నిర్వహించిన యోగా డే కోసం అంత కంటే ఎక్కువే ఖర్చు చేశారు. మ్యాట్లు మొదలు మిగిలిన సామాగ్రి కొనుగోలులోనూ తీవ్ర అవినీతికి పాల్పడ్డారని వైఎస్ జగన్ గుర్తు చేశారు.



