
సాక్షి, విజయవాడ: నగరంలోకి శాతవాహన కళాశాల వివాదం మరోసారి తెర మీదకు వచ్చింది. టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ తనను వేధిస్తున్నారంటూ ఆ కాలేజీ ప్రిన్సిపాల్ వంకాయలపాటి శ్రీనివాస్ మళ్లీ ఆరోపణలకు దిగడం చర్చనీయాంశమైంది.
టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తనను బెదిరిస్తున్నారని తాజాగా నగర పోలీస్ కమిషనర్కు శాతావాహన ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆలపాటి కాల్ రికార్డ్ ఆడియోను మీడియాకు విడుదల చేశారాయన. ‘‘టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి నాకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. నా ఫోన్ సీఐడీతో ట్యాపింగ్ చేయిస్తున్నారని చెబుతున్నారు. గతంలో ఒకసారి ఫ్యామిలీ అందరినీ చంపేస్తానని ఆలపాటి బెదిరించారు. వారం క్రితం ఆలపాటి నాకు ఫోన్ చేసి నిన్ను వదలను అని బెదిరించారు. సీపీని కలిసి నన్ను రక్షించాలని కోరా..
.. గతంలో ఒకసారి కూడా నన్ను కిడ్నాప్ చేసి గుంటూరు ఇంటికి తీసుకు వెళ్ళారు. ఆ సమయంలో కూడా పోలీసులకి నా కుమారుడు ఫిర్యాదు చేస్తే అర్ధరాత్రి నన్ను విడిచి పెట్టారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి ఈ విషయం తీసుకెళ్లానని ఆలపాటి నన్ను బెదిరిస్తున్నారు. నేను ఆలపాటి పై డిజిపికి కూడా ఫిర్యాదు చేశాను. శాతవాహన కళాశాల విషయంలో ఆలపాటికి సంబంధం లేకపోయినా ఆయన చెప్పినట్టు వినాలని నన్ను బెదిరిస్తున్నారు. అధికార పార్టీ నేత కాబట్టి నేనేం చేయలేక రక్షణ కోసం పోలీసులని ఆశ్రయించాను అని శ్రీనివాస్ మీడియాతో అన్నారు.