తల్లిదండ్రులు, గ్రామపెద్దలు వెళ్లడంతో వదిలిపెట్టిన వైనం
నంద్యాల జిల్లా రుద్రవరం టోల్ప్లాజా వద్ద ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి హల్చల్
పాములపాడు: నంద్యాల జిల్లా శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి బుధవారం టోల్ప్లాజా ఉద్యోగి మహేష్ ను కిడ్నాప్ చేశారు. అతడి తల్లిదండ్రులు, తోటి ఉద్యోగులు, గ్రామపెద్దలు వెళ్లడంతో వదిలిపెట్టారు. టోల్ప్లాజా ఉద్యోగిని దౌర్జన్యంగా కారులో ఎక్కించి తీసుకెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నేషనల్ హైవే 340సీ మీద పాములపాడు మండలం రుద్రవరం వద్ద టోల్ప్లాజా ఉంది. ఆ టోల్ప్లాజాలో రుద్రవరం గ్రామానికి చెందిన మహేష్ టోల్ కలెక్టర్గా పనిచేస్తున్నారు.
బుధవారం ఉదయం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి కర్నూలు నుంచి ఆత్మకూరు వైపు వెళ్లారు. ఈ క్రమంలో ఆయన వాహనం యూపీఐ చెల్లింపుల లైన్లోకి వచ్చింది. ముందున్న వాహనం యజమాని టోల్చార్జీని ఫోన్పే ద్వారా చెల్లిస్తుండటంతో ఎమ్మెల్యే వాహనం ఆగాల్సి వచ్చింది. దీంతో ఎమ్మెల్యే టోల్ప్లాజా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘నేనెవరినో తెలియదా.. నీ కథ చూస్తాను’’ అంటూ హూంకరించారు. ‘వాడిని కారులో ఎక్కించండిరా..’ అంటూ అనుచరులను పురమాయించగా వారు మహేష్ ను బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు. మహేష్ ను ఎమ్మెల్యే స్వగ్రామమైన వెలుగోడు మండలం వేల్పనూరుకు తీసుకెళ్లారు. దీంతో మహేష్ తల్లిదండ్రులు, గ్రామపెద్దలు, టోల్ప్లాజా ఉద్యోగులు వేల్పనూరు వెళ్లారు. అనంతరం మహేష్ ను ఎమ్మెల్యే అనుచరులు వదిలిపెట్టారు.


