
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సూపర్ స్పెషాలిటీ వైద్య విద్యనభ్యసించే విద్యార్థులు, కోర్సు పూర్తయ్యాక మూడేళ్ల పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేయాల్సిందే. దీనికోసం కోర్సులో చేరే సమయంలోనే రూ.50 లక్షల పూచీకత్తు బాండును సమర్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు వైద్య విద్యా సంచాలకులు అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 70వరకూ వివిధ విభాగాల్లో సూపర్ స్పెషాలిటీ కోర్సులున్నాయి.
ఈ విద్యార్థుల కోసం సర్కారు భారీగా వ్యయం చేస్తోంది. కనుక పేద ప్రజలకు సేవలందించడంలో భాగంగా సూపర్ స్పెషాలిటీ పూర్తయ్యాక మూడేళ్లపాటు ఇక్కడే సేవలు అందించాల్సి ఉంటుంది. ఇలాంటి విధానం ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో అమలు జరుగుతోంది. అడ్మిషన్ సమయంలోనే వైద్యవిద్యార్థుల నుంచి ఆమోదపత్రం తీసుకునే సీటు ఇస్తారు.