మలేరియాకు ముకుతాడు! | Special screening in 446 high-risk villages for Malaria disease | Sakshi
Sakshi News home page

మలేరియాకు ముకుతాడు!

Oct 18 2020 3:54 AM | Updated on Oct 18 2020 3:54 AM

Special screening in 446 high-risk villages for Malaria disease - Sakshi

సాక్షి, అమరావతి: మలేరియా తగ్గుముఖం పట్టింది. గడిచిన నాలుగేళ్లతో పోలిస్తే 2020లోనే అతి తక్కువ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఓ వైపు భారీగా వర్షాలు పడుతున్నా కేసుల నమోదు తక్కువగా ఉండటం ఊరటనిస్తోంది. మొత్తమ్మీద ఈ ఏడాది దోమ కాటు జ్వరాలు పూర్తిగా నియంత్రణలోకి వచ్చినట్టు తేలింది. ఓ వైపు కరోనా నియంత్రణ చర్యలు చేపడుతూనే మరోవైపు మలేరియా, డెంగీ, చికున్‌గున్యా కేసులు వ్యాప్తి చెందకుండా అదుపులోకి తెచ్చారు. ఇప్పటికీ క్షేత్ర స్థాయిలో సిబ్బంది గ్రామీణ ప్రాంతాల్లో దోమకాటు వ్యాధులపై పర్యవేక్షణ చేస్తున్నారు. మున్సిపాలిటీల పరిధిలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. పారిశుధ్యంపై ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. 

2016 తర్వాత తగ్గుముఖం  
► 2016తో పోల్చుకుంటే 2019 నాటికి 87.60 శాతం మలేరియా కేసులు తగ్గాయి. రాష్ట్రంలో 11 సెంటినల్‌ సర్వెలెన్స్‌ ఆస్పత్రుల్లో కేసుల నిర్ధారణ, చికిత్స జరిగింది. ఈ ఏడాది మృతుల సంఖ్య ఒక్కటి కూడా లేదు. 
► శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో 13.33 లక్షల దోమతెరలు పంపిణీ చేశారు. 446 హైరిస్క్‌ గ్రామాల్లో మలేరియా స్క్రీనింగ్‌ కార్యక్రమం పూర్తి అయింది. ఇప్పటిదాకా 1.48 కోట్ల మందికి మలేరియాపై స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించారు. 
► చికున్‌గున్యా, డెంగీ కేసుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో దోమకాటు జ్వరాలు రాకుండా క్షేత్ర స్థాయిలో సిబ్బంది ప్రత్యేకంగా పర్యవేక్షించారు. డెంగీ, గున్యా జ్వరాలు సోకిన బాధితులకు తక్షణమే వైద్యమందేలా చర్యలు తీసుకున్నారు. నవంబర్‌ మాసాంతం వరకు మలాథియాన్, పైరిథ్రిమ్‌ మందులు పిచికారి చేయాలని నిర్ణయించారు. 

Advertisement
 
Advertisement
Advertisement