వాటిని జీవీఎంసీ ఎలా క్రమబద్దీకరిస్తుంది?
రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ లేఖ
సాక్షి, అమరావతి : విశాఖ రూరల్ మండలం ఎండాడ, రుషికొండ పరిధిలోని నిషేధిత జాబితా 22ఏలో ఉన్న భూములను గీతం యూనివర్సిటీకి ఎలా బదలాయిస్తారని కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గీతం యూనివర్సిటీకి గతంలోనూ, ప్రస్తుతం ఇస్తున్న భూముల్లో 22ఏ భూములున్నాయనే విషయం రెవెన్యూ, జీవీఎంసీ అధికారులకు తెలియకపోవడం బాధాకరమన్నారు.
ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ జి. జయలక్ష్మికి శనివారం మరోసారి లేఖ రాశారు. సీసీఎల్ఏ జయలక్ష్మికి రాసిన లేఖలో.. ఎండాడలో సర్వే నెంబర్లు 15/1–15/5, 16/4, 17/29, 17/30, 18/2, 20/5, 19/1, 19/2, 19/9, రుషికొండలో 37/2, 55/5 సర్వే నెంబర్లు నిషేధిత జాబితాలో ఉన్నట్లు తెలిపారు. ఎండాడలో సర్వే నెంబర్ 17లో ఉన్న 67.37 ఎకరాల అదనపు ప్రభుత్వ భూమి నిషేధిత జాబితాలో ఉన్నా 2025 జనవరి 30న గుట్టుచప్పుడు కాకుండా గీతంకు బదలాయించినట్లు శర్మ పేర్కొన్నారు.
ఆ భూముల మార్కెట్ ధర రూ.1,500 కోట్లకు పైనే ఉందని, ఈ బదలాయింపు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని లేఖలో స్పష్టంచేశారు. ఎండాడ, రుషికొండ అడంగల్ రికార్డులను బట్టి ఈ సర్వే నెంబర్లే కాకుండా ఇతర సర్వే నెంబర్లలోని భూములను కూడా గీతం వర్సిటీ ఆక్రమించిందన్నారు. టూరిజం శాఖకు కేటాయించిన భూములు, అసైన్డ్ భూములు కూడా గీతం ఆక్రమణలో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ విషయాలను పరిశీలించకుండా వాటిని గీతంకు క్రమబద్ధీకరించేందుకు అనుమతించడం చట్ట విరుద్ధమని ఆయన తెలిపారు.
సాయిప్రసాద్కు రాసిన లేఖలోని అంశాలు..
జీవీఎంసీ సమావేశంలో గీతం యూనివర్సిటీకి ప్రభుత్వ భూములు బదలాయించడానికి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏకపక్షంగా ఆమోదించడం బాధాకరం. జీవీఎంసీ ఆమోదించిన భూముల్లో 22ఏ జాబితాలో ఉన్న భూములు కూడా ఉన్నాయి. జిల్లా రెవెన్యూ అధికారులు, జీవీఎంసీ క్షుణ్ణంగా పరిశీలించకుండా ఈ ప్రతిపాదనను ఆమోదించడం కోర్టు ఆదేశాలను ధిక్కరించడమే. 2025 జులై 16న కె. సుందరరామరాజు వర్సెస్ ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన కేసులో (రిట్ పిటిషన్ నెం:8940/2017) హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఈ భూముల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అలాగే..
» కోర్టు తీర్పు ప్రకారం ఎండాడలో సర్వే నెంబర్ 19లోని 85 ఎకరాలు కొండ పోరంబోకు భూమిగా తేలింది. అలాంటి భూమిలో నిర్మాణాలను జీవీఎంసీ తన మాస్టర్ ప్లాన్లో నిషేధించింది. ఈ నేపథ్యంలో గీతంకు ఆ భూమిని ఇవ్వడానికి ఎలా అనుమతించారు?
» ఇక ఆ సర్వే నెంబరులోని 2.5 ఎకరాల విషయంలో 2025 జులై 16న హైకోర్టు ఇచి్చన తీర్పు విషయాన్ని జీవీఎంసీకి పంపిన లేఖలో తహశీల్దార్ ఎందుకు ప్రస్తావించలేదు?
» నేను గతంలో రాసిన లేఖల్లో గీతం ఆక్రమించిన భూముల్లో డీపట్టా భూములు కూడా ఉండవచ్చని.. అలాంటి భూములను ఆక్రమించడం నిషేధించారని.. దానిపైనా దర్యాప్తు చేయాలని కోరాను. ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను పెద్దలకు ఎలా క్రమబద్దీకరిస్తారు?


