రానున్న మూడు రోజులు వర్షాలు
సాక్షి, అమరావతి: వాయవ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ గురువారం తెలిపింది. రానున్న రెండు, మూడు రోజుల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒకటి, రెండుచోట్ల భారీ వర్షాలు, మిగతా చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
తీరం వెంబడి గంటకు 40, 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం శ్రీకాకుళం, పోలవరం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.


