కర్ణాటకలో పింఛన్‌ కష్టం.. | Problems For Pension In Karnataka | Sakshi
Sakshi News home page

కర్ణాటకలో పింఛన్‌ కష్టం..

Jan 15 2024 8:29 AM | Updated on Jan 15 2024 8:38 AM

Problems For Pension In Karnataka  - Sakshi

శివాజీనగర: పింఛన్‌ కోసం కర్ణాటక రాష్ట్రంలో 77 ఏళ్ల ఓ దివ్యాంగ వృద్ధురాలు రెండు కిలోమీటర్లకు పైగా పాక్కుంటూ పోస్టాఫీసుకు వచ్చిన ఘటన అం­దర్నీ నివ్వెరపరిచింది. పంటిబిగువన నరకయాతన అనుభవిస్తూ పోస్టాఫీసుకు వచ్చిన ఆమెకు తీవ్ర నిరాశే మిగిలింది. అవ్వాతాతలకు పింఛన్ల పం­పి­­ణీ అమలు విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు, ఇతర రాష్ట్రాలకు ఉన్న తేడాకు ఈ ఘటన నిదర్శనంగా ని­లుస్తోంది. ఏపీలో ఒకటో తేదీ వచ్చిందంటే.. వలంటీర్లు తెల్లారకముందే తలుపుకొట్టి అవ్వాతాతల చేతుల్లో పింఛను సొమ్ము పెడుతుండడం తెలిసిందే.

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవంతంగా కొనసాగుతున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని కర్ణాటకలో అమలవుతున్న తీరుతో కన్నడిగులు పోలుస్తున్నారు. కర్ణాటకలోని దావణగెరె జిల్లా హరిహర తాలూకా కుణిబెళకెర గ్రామానికి చెందిన వయో వృద్ధురాలు గిరిజమ్మకు ఎవరూలేరు. ప్రభుత్వం ఇచ్చే పెన్షనే ఆమెకు జీవనాధారం. ప్రతి నెలారంభంలో హరి­హర పోస్టాఫీసులో పెన్షన్‌ తీసుకుంటుంది. గత ఏడాది నవంబరు నుంచి సక్రమంగా అందడంలేదు. ఆటోలో రావడానికి డబ్బులు లేకపోవడంతో వారం రోజుల కిందట గ్రామం నుంచి రెండు కిలో మీటర్లు పాక్కుంటూ పోస్టాఫీసుకు వచ్చింది.

కానీ, పెన్షన్‌ ఇంకా రాలేదని సిబ్బంది చెప్పడంతో హతాశురాలైంది. ఆమె కష్టాన్ని కొందరు ఫొటోలు, వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పెట్టడంతో వైరల్‌ అయ్యింది. అంతదూరం నుంచి పాక్కుంటూ రావడంవల్ల ఒళ్లు చీరుకుపోయి బొబ్బలు వచ్చినా లెక్కచేయలేదు. ‘ఆ పెన్షన్‌ వస్తేనే నాకు రోజు గడుస్తుంది. అదే లేకపోతే ఏం తినాలి, అందుకే కష్టమైనా పాకుతూనే వచ్చాను..’ అని గిరిజమ్మ దీనంగా చెప్పింది.

 కాగా, ఈ విషయమై పెద్దఎత్తున విమర్శలు రావడంతో స్థానిక సబ్‌ కలెక్టర్‌ అమూల్య పాండా స్పందిస్తూ.. ఇంటికే వెళ్లి పెన్షన్‌ అందజేసే సదుపాయం రాష్ట్రంలో లేదనడం గమనార్హం. ఏపీలో వైఎస్‌ జగన్‌ సర్కారు ప్రతి నెలా మొదటి తారీఖునే ఇళ్లకే వెళ్లి మరీ అవ్వాతాతలకు రూ.3వేలు చొప్పున ఫించన్‌ సొమ్ము అందజేస్తుండడం తెలిసిందే. దేశంలో రూ.3 వేల ఫించన్‌ తోపాటు ఎక్కువ మందికి ఫించన్లు ఇస్తున్న రాష్ట్రం కూడా ఏపీనే కావడం విశేషం. 

Advertisement
 
Advertisement
Advertisement