Operation Sindhu: ఏపీ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు | AP Students Who Returned From Iran, Says No Help From Kutami Prabhutvam During Operation Sindhu | Sakshi
Sakshi News home page

Operation Sindhu: ఏపీ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు

Jun 24 2025 11:08 AM | Updated on Jun 24 2025 12:48 PM

Operation Sindhu: No Help From Kutami Prabhutvam Says Iran AP Students

సాక్షి, న్యూఢిల్లీ: ఆపరేషన్‌ సిందులో భాగంగా.. ఇరాన్‌ నుంచి స్వస్థలానికి భారతీయుల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా ఢిల్లీ చేరుకున్న విమానంలో ఐదుగురు ఏపీ విద్యార్థులు కూడా ఉన్నారు. వీళ్లంతా కెర్మన్‌ మెడికల్‌ యూనివర్సిటీలో చదువుతున్నారు. అయితే.. ఏపీ ప్రభుత్వం తమను ఏమాత్రం పట్టించుకోలేదని చెబుతున్నారు వాళ్లు. 

‘‘నాలుగు రోజుల నుంచి ఇరాన్‌ నుంచి భారతీయుల తరలింపు కార్యక్రమం కొనసాగుతోంది. మమ్మల్ని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించారు. కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా ఢిల్లీకి తీసుకువచ్చింది.  ఢిల్లీ నుంచి స్వయంగా మేమే మా ఖర్చులతో నంద్యాలకు  వెళ్తున్నాం. మిగతా వాళ్లకు వాళ్ల వాళ్ల రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి. కానీ, ఏపీ ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి సాయం అందలేదు. మాకు ఫ్లైట్ టికెట్స్ ఇవ్వడం లేదు. కేంద్ర ప్రభుత్వం చేసినట్టుగా, ఏపీ ప్రభుత్వం కూడా చేస్తే బాగుండేది.. 

.. మేము ఉన్న ప్రాంతంలో యుద్ధం ప్రభావం లేదు. అయినా ముందు జాగ్రత్త చర్యగా కాలేజీ యాజమాన్యం సెలవులు ఇచ్చింది. ప్రస్తుతం ఎంబీబీఎస్‌ సెకండ్ ఇయర్ చదువుతున్నాం. యుద్ధం రావడం వల్ల సెమిస్టర్ పరీక్షలు ఆగిపోయాయి. కాలేజీ యాజమాన్యం పిలిస్తే మళ్లీ వెంటనే ఇరాన్ వెళతాం అని నంద్యాలకు చెందిన నరేందర్‌, నారాయణలు తెలిపారు. 

ఆపరేషన్‌ సిందు గురించి.. 
ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు భారత ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్‌ ఇది. మొదటి దశలో.. జూన్ 19న 110 మంది భారతీయ విద్యార్థులతో కూడిన ప్రత్యేక విమానం ఢిల్లీకి చేరింది. వీరిలో 90 మంది జమ్మూ కశ్మీర్‌కు చెందినవారు. రెండో దశలో జూన్ 21న మరో 310 మంది భారతీయులు ఇరాన్ నుంచి తరలించబడ్డారు. ఈ విమానం ఢిల్లీలో సాయంత్రం 4:30కి ల్యాండ్ అయింది. మొత్తం ఇప్పటివరకు: 827 మందిని భారత్‌కు సురక్షితంగా తీసుకువచ్చినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది.

ఆపరేషన్‌ సిందు కోసం.. ఇరాన్ ప్రభుత్వం భారత పౌర విమానాల రాకపోకల కోసం తమ గగనతలాన్ని ప్రత్యేకంగా తెరిచింది. ఈ ఆపరేషన్‌లో రోడ్డుమార్గం ద్వారా అర్మేనియాకు తరలించి, అక్కడి నుంచి విమానాల ద్వారా భారత్‌కు తీసుకురావడం వంటి వ్యూహాత్మక చర్యలు కూడా తీసుకున్నారు.

యుద్ధం ఇలా.. 
జూన్‌ 13వ తేదీన ఇరాన్‌ నుంచి ప్రపంచానికి అణు ముప్పు ఉందని చెబుతూ ఇజ్రాయెల్‌ ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌ పేరిట దాడులకు దిగింది ఇజ్రాయెల్‌. ప్రతిగా ఇరాన్‌ సైతం మిస్సైల్స్‌తో ఇజ్రాయెల్‌పై దాడులు జరిపింది. చివరకు.. ట్రంప్‌ మధ్యవర్తిత్వంలో ఇరుదేశాలు మంగళవారం (జూన్‌24న) కాల్పుల విరమణకు అంగీకరించాయి. దీంతో పశ్చిమాసియా యుద్ధం ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement