అమలాపురంలో 14వ అదనపు జిల్లా కోర్టును ప్రారంభిస్తున్న హైకోర్టు న్యాయమూర్తులు
పాల్గొన్న ఐదుగురు హైకోర్టు న్యాయమూర్తులు
అమలాపురం టౌన్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో కొత్తగా ఏర్పాటైన 14వ అదనపు జిల్లా కోర్టు, 2వ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) కోర్టు కం మేజిస్ట్రేట్ కోర్టుల ప్రారంభోత్సవం ఆదివారం జరిగింది. ఈ కోర్టులను తూర్పుగోదావరి జిల్లా పాలన జడ్జీ, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్.రఘునందన్రావు, జస్టిస్ సుమతి జగడం, జస్టిస్ బీవీఎల్ఎన్ చక్రవర్తి, జస్టిస్ న్యాపతి విజయ్ ప్రారంభించారు.
అనంతరం అమలాపురం కోర్టుల ప్రాంగణంలో తూర్పుగోదావరి జిల్లా జడ్జి గంధం సునీత అధ్యక్షతన జరిగిన సభకు హైకోర్టు న్యాయమూర్తులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. న్యాయ వ్యవస్థ, బార్ అసోసియేషన్ సమన్వయంతో ఒక మదర్ శాఖలా వ్యవహరిస్తూ ప్రతి ఒక్కరూ తమ విధులను సక్రమంగా నిర్వర్తించి వ్యవస్థను ముందుకు నడిపించాలని వారు ఆకాంక్షించారు. అమలాపురం 14వ అదనపు జిల్లా కోర్టు జడ్జి గంటా ప్రియదర్శిని, 2వ అదనపు జిల్లా కోర్టు జడ్జి గుబ్బల చంద్ర మౌళీశ్వరి, అమలాపురం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కాశి శేషారావు, తదితరులు పాల్గొన్నారు.


