సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల సమ్మె ఐదో రోజుకు చేరుకుంది. నేటికీ బకాయిల విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. రేపు వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీతో నెట్వర్క్ ఆసుప్రతుల ప్రతినిధులు భేటీ కానున్నారు. నెట్వర్క్ ఆసుపత్రుల సమ్మెతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.
చంద్రబాబు ప్రభుత్వం రూ.3 వేల కోట్ల బకాయిలు పెట్టడంతో పేదల ప్రాణాలకు రక్షణగా నిలవాల్సిన ఆరోగ్యశ్రీ పథకం వెంటిలేటర్పైకి చేరింది. బకాయిల విడుదలపై ప్రభుత్వం పదేపదే హామీలిచ్చి, ఆచరణలో పైసా కూడా విదిలించకపోవడంతో ఆస్పత్రుల యాజమాన్యాలు చేతులెత్తేశాయి. సిబ్బందికి జీతాలు, మందుల సరఫరాదారులకు బకాయిలు చెల్లించలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి.
తమ పరిస్థితిని ప్రజలకు తెలియజేయడంతో పాటు, ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ ఆస్పత్రుల దగ్గర యాజమాన్యాలు బోర్డులు పెట్టి నిరసన చేపడుతున్నాయి. దీంతో పేద రోగులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. క్యాన్సర్, గుండె, ఇతర సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు కొత్తగా ఎటువంటి ఆరోగ్యశ్రీ కేసులను చేర్చుకోవడం లేదు. అత్యవసరమైన కేసుల్లో చికిత్సలకు రోగుల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారు. అయినప్పటికీ సీఎం చంద్రబాబు మాత్రం ఏమీ పట్టనట్టే వ్యవహరిస్తున్నారు.


