 
													నెల్లూరు సిటీ: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలంలోని పవిత్ర వేదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో కొందరు అసభ్యకర వీడియోలను చిత్రీకరించారు. ఇవి సోషల్ మీడియా ద్వారా బయటకు రావడం జిల్లాలో చర్చనీయాంశమైంది. జిల్లాలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి నిత్యం ఎంతోమంది భక్తులు వస్తుంటారు. అలాంటి పవిత్ర ప్రదేశంలో నిఘా కొరవడటంపై భక్తులు మండిపడుతున్నారు.
నరసింహకొండపై వెలసిన అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఓ యువజంట కౌగిలించుకుంటూ అసభ్యకర వీడియోలు చిత్రీకరించారు. ఆపై దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్చేశారు. ఈ వీడియోను చూసిన నెల్లూరు వాసులు, ఇతరుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో.. వెంటనే ఆ జంట క్షమాపణ చెప్తూ పోస్టు పెట్టింది. ఆర్నెల్ల క్రితం కూడా కొండపైన చెట్ల మధ్యలో కొందరు మద్యం సేవిస్తూ వీడియోలను చిత్రీకరించారు.
వీటినీ సోషల్ మీడియలో పోస్ట్ చేశారు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. ఇలా నరసింహకొండపై తరచూ నిఘా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఆలయ ప్రధాన ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటుచేయకపోవడం, ఆలయానికి ఎవరెవరు వస్తున్నారనే కనీస నిఘా వ్యవస్థ లేకపోవడం దారుణమని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
