రమణీయం..చారిత్రక దృశ్యకావ్యం | Nagarjuna Hill a place of historical wealth and natural beauty | Sakshi
Sakshi News home page

రమణీయం..చారిత్రక దృశ్యకావ్యం

Apr 26 2025 4:52 AM | Updated on Apr 26 2025 4:52 AM

Nagarjuna Hill a place of historical wealth and natural beauty

చారిత్రక సంపదకు, ప్రకృతి సోయగాలకు నెలవు నాగార్జున కొండ 

నాటి చరిత్రకు ప్రతిరూపం అనుపు 

వేసవి సెలవుల్లో వినోదం..  విజ్ఞానదాయకం

విజయపురిసౌత్‌: విద్యార్థులకు ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది. రెండు తెలుగు రాష్ట్రాలకు అతి సమీపంలో ఉన్న నాగార్జున సాగర్‌ను కుటుంబ సమేతంగా వేసవి సెలవుల్లో చూడాల్సిందే. సాగర్‌ పర్యాటకులకు స్వర్గధామంగా నిలుస్తుంది. చారిత్రాత్మకమైన ప్రాంతమే కాకుండా సాంకేతిక పరంగా సాగర్‌ ప్రాజెక్టు సందర్శన ఎంతో విజ్ఞానదాయకంగా నిలుస్తోంది. కృష్ణా జలాశయంలో లాంచీ ప్రయాణం ఆహ్లాదకరం. లాంచీలో ప్రయాణించి జలాశయం మధ్యన ఎనలేని ప్రశస్తి ఉన్న నాగార్జునకొండ మ్యూ­జియం సందర్శించాల్సిందే. 

ప్రపంచంలోనే మానవ నిర్మిత ఐలాండ్‌ మ్యూజియంలలో నాగార్జునకొండ  రెండవది. ఆచార్య నాగార్జునుని విశ్వవిద్యాలయం ఇక్కడ ఉంది. బుద్ధదంత ధామమయమైన మహాస్థూపం, విశాలమైన వివిధ భిక్షువిహారాలు ఉన్నాయి. వీటన్నింటితో ఇక్షా్వకుల రాజధానిగా విలసిల్లిన విజయపురి ప్రాంతం సాగర్‌లో ముంపునకు గురి కాకుండా కేంద్ర పురావస్తు శాఖ వారు అక్కడ విశేష సామగ్రిని పరిరక్షించి, నేడు నాగార్జున కొండలో ప్రదర్శిస్తున్నారు.  

హారతీ దేవాలయం 
విశ్వవిద్యాలయానికి కొద్దిదూరంలో హారతీ దేవాలయం దాని దిగువన చతురస్త్రాకారంలో ఒకపెద్ద సరస్సు ఉంది. దీనికి నలువైపుల మెట్లతో ఒడ్డు ప్రాంతాలు­న్నాయి.   హారతీ దేవాలయంలో ప్రవేశానికి ముందు ఈ సరస్సులో స్నానమాచరించేవారు.  

నాగార్జున కొండకు ఇలా చేరుకోవాలి.. 
నాగార్జునకొండకు వెళ్లాలంటే విజయపురిసౌత్‌లోని లాంచీస్టేషన్‌ నుంచి 14కి.మీ. దూరం కృష్ణానదిలో ప్రయాణం చేయాలి. కొండకు చేరుకునేందుకు లాంచీలో 45 నిమిషాల సమయం పడుతుంది. నాగార్జునకొండ ప్రపంచంలోనే రెండవ ఐలాండ్‌ మ్యూజియం. నాగార్జున సాగర్‌ పరిధిలోని విజయపురిసౌత్‌లో లాంచీస్టేషన్‌లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు లాంచీలు పర్యాటకులకు అందుబాటులో ఉంటాయి. 

పెద్దలకు లాంచీ టిక్కెట్టు ధర రూ.200, మ్యూజియం, మాన్యుమెంట్‌ సందర్శనకు రూ.30, 6 నుంచి 12 సంవత్సరాల  చిన్నారులకు లాంచీకు రూ.150, మ్యూజియం సందర్శనకు 14 సంవత్సరాలలోపు చిన్నారులకు ఉచితం. గ్రూపుగా వచ్చే విద్యార్థులకు లాంచీటిక్కెట్‌పై 20 శాతం రాయితీని పర్యాటకశాఖ ఇస్తుంది. ఇతర వివరాలకు లాంచీస్టేషన్‌ ఫోన్‌ 9705188311 నెంబర్‌ను సంప్రదించవచ్చు.  

మహా చైత్యం 
ఇది బుద్ధ దాతువుపై కట్టిన అందాల చైత్యం. ఈసూ్థపం నుంచి తవ్వి తీసిన ధాతువును ప్రస్తుతం బుద్ధుడు మొదటి ప్రసంగం చేసిన సారనాథ్‌లో ఉంచి, పూజిస్తున్నారు. ఇది శారీరక స్థూపాల జాతికి చెందినది. దీని అంతర్భాగంలో బుద్ధభగవానుని అస్థికలు అమర్చబడ్డాయి. ఇది ప్రాచీన శిల్ప నిర్మాణ ప్రావీణ్యానికి నిదర్శనం. చక్రము దాని ఆకులను ఇటుక గోడల్లా నిర్మంచి ఆకుల మధ్య ఖాళీ స్థలాన్ని మట్టితో కప్పి స్థూపాకారాన్ని తయారు చేసి ఉపరితలాన్ని చుట్టుపక్కల పాలరాతి పలుకలతో కప్పి అర్థగోళాకారంగా అందంగా నిర్మించారు.

ప్రాచీన విశ్వవిద్యాలయం
ఈ విశ్వవిద్యాలయం శిథిల అవశేషాలు నాగార్జునకొండ లోయలో ఏవిధంగా ఉండేవో అదే విధంగా ఆ ఇటుకలతోనే అనుపు వద్ద అమర్చారు. కృష్ణానది తీరాన విశాలమైన విస్తీర్ణంలో ఈ విశ్వవిద్యాలయం నెలకొని ఉండేది. ఇది ప్రాచీన కాలపు గురుకులమై గురుశిష్య నివాసాలు ఒకేదగ్గరుండి సకల శాస్త్ర విజ్ఞాన కేంద్రమై, ప్రపంచఖ్యాతి గాంచింది. 

ఎత్తిపోతల సోయగం
సాగర్‌కు 15 కి.మీ. దూరంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో చంద్రవంక  నదిపై సహజ సిద్ధంగా ఏర్పడిన జలపాతం. ఇది 70 అడుగుల పైనుంచి జాలువారే జలపాతం. పర్యాటకుల మనస్సును  ఇట్టే ఆకర్షిస్తుంది. పూర్వకాలంలో యతులు తపస్సు చేసుకునే ప్రాంతం కావటంతో ఎత్తిపోతల అనే పేరు వచ్చింది. పెద్దలకు రూ.30 పిల్లలకు రూ.20 ప్రవేశ రుసుము వసూలు చేస్తారు. సాగర్‌నుంచి ముగ్గురు నలుగురు కలిసి ఆటో మాట్లాడుకోని వెళ్లాలి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement