72 రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ | Modernization of 72 railway stations | Sakshi
Sakshi News home page

72 రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ

Aug 3 2023 4:28 AM | Updated on Aug 3 2023 4:28 AM

Modernization of 72 railway stations - Sakshi

ఆంధ్రప్రదేశ్‌లోని 72 రైల్వే స్టేషన్లను అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకంలో భాగంగా ఆధునికీకరణ, అప్‌గ్రేడేషన్‌ కో­సం గుర్తించినట్లు రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. 2023–24లో జూన్‌ 2023 వరకు దక్షిణ మధ్య రైల్వేలో అభివృద్ధి నిమిత్తం రూ.83.64  కోట్లు వ్యయం చేసినట్లు వైఎస్సార్‌సీపీ ఎంపీ సంజీవ్‌కుమార్‌ ప్రశ్నకు సమాధానమిచ్చారు.  

ఐదేళ్లలో 79 ర్యాంకుల మెరుగు  
ప్రపంచబ్యాంకు డూయింగ్‌ బిజినెస్‌ రిపోర్టు (డీబీఆర్‌)–2020 ప్రకారం భారతదేశ ర్యాంకు 2014లో 142 ఉండగా 79 ర్యాంకులు మెరుగై 2019కి 63వ ర్యాంకుకు చేరుకుందని కేంద్ర వాణిజ్యశాఖ సహాయమంత్రి సోమ్‌ప్రకాశ్‌.. వైఎస్సార్‌సీపీ ఎంపీలు మిథున్‌రెడ్డి, మార్గాని భరత్‌రామ్, ఎన్‌.రెడ్డెప్ప ప్రశ్నకు జవాబిచ్చారు.  

దక్షిణమధ్య రైల్వేలో ఖాళీలు  
దక్షిణమధ్య రైల్వేలో గ్రూప్‌ ఏ, సీల్లో పలు ఖాళీలున్నట్లు రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. గ్రూపు ఏలో 110, గ్రూపు సీలో 10,338 ఖాళీలున్నాయని వైఎస్సార్‌సీపీ ఎంపీ చింతా అనూరాధ ప్రశ్నకు సమాధానమిచ్చారు.  

ఏపీ ప్రాంతాలు సికింద్రాబాద్‌ఆర్‌ఆర్‌బీ పరిధిలో  
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాంతాలు సికింద్రాబాద్‌ రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు పరిధిలోకి వస్తాయని రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. వైఎస్సార్‌సీపీ  ఎంపీ సంజీవ్‌కుమార్‌ ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. దక్షిణమధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వేలు సికింద్రాబాద్‌ పరిధిలోకి వస్తాయని చెప్పారు. సెంట్రలైజ్డ్‌ ఎంప్లాయిమెంట్‌ నోటిఫికేషన్ల ప్రకారం దేశంలోని 21 బోర్డుల్లో ఎక్కడైనా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.  

అనకాపల్లి జిల్లాలో పాస్‌పోర్టు కేంద్రం ఏర్పాటు చేయండి  
అనకాపల్లి జిల్లాలో కేంద్ర ప్రాంతీయ పాస్‌పోర్టు సేవాకేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విదేశాంగమంత్రి జయశంకర్‌కు వైఎస్సార్‌సీపీ ఎంపీ బి.వి.సత్యవతి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఆమె మంత్రికి వినతిపత్రం ఇచ్చారు. అనకాపల్లి జిల్లాలో పాస్‌పోర్టు సేవాకేంద్రం ఏర్పాటుచేస్తే  అల్లూరి, కాకినాడ, విజయనగరం, విశాఖ జిల్లాల వాసులకు కూడా ఎంతో ఉపకరిస్తుందని తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement