
ముఖ్యమంత్రివ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనల్లోంచి పుట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఎంతో అద్భుతమైనదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. ఈ నెల 30వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో మంత్రి విడదల రజిని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకు మరింత చేరువే చేసే వీలు ఏర్పడిందని చెప్పారు. ఇప్పటికే గ్రామాల్లో ఫేజ్ 1 సర్వే పూర్తయిందని చెప్పారు. ఫేజ్ -2 , ఫేజ్ -3 సర్వే లు జరుగుతున్నాయని తెలిపారు.
అన్ని సర్వేలు పక్కాగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. ఆయా జిల్లాలల వైద్య ఆరోగ్యశాఖ అధికారులు జగనన్న సురక్ష కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో పర్యవేక్షించాలని చెప్పారు. క్యాంపుల్లో భాగంగా ఏడు రకాల వైద్య పరీక్షలు చేయడంతోపాటు ఏకంగా 118 రకాల మందులను అందుబాటులో ఉంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని, క్షేత్రస్థాయిలో ఇవన్నీ పక్కాగా అమలయ్యేలా చూడాలని కోరారు. ఆరోగ్య శ్రీ పథకంపై పూర్తి అవగాహన కల్పించేలా ఇంటింటికీ వాలంటీర్లు కరపత్రాలను పంపిణీ చేస్తున్నారని చెప్పారు. ఈ కరపత్రాల్లో ఉన్న అన్ని అంశాలపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.
యాప్లు కొలమానంగా..!
మంత్రి మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా వాలంటీర్లు ఇంటింటి సర్వే కు వచ్చే సమయంలో ఆరోగ్యశ్రీ యాప్ ల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రి తెలిపారు. ఎన్ని సెల్ఫోన్ లలో ఆరోగ్యశ్రీ అనువర్తనం డౌనల్ లోడ్ అయింది అనే దానిపై కూడా మదింపు ఉంటుందని తెలిపారు. ఎక్కుడ సెల్ఫోన్లలో ఆరోగ్యశ్రీ యాప్ డౌన్లోడ్ అయితే ఆ వాలంటీర్లు బాగా పనిచేసినట్లుగా గుర్తించాలని కోరారు. గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించే తేదీలకు సంబంధించి దండోరా వేయించడం ద్వారా కూడా ప్రజలకు అవగాహన కల్పించే విషయాన్ని పరిశీలించాలని తెలిపారు. క్యాంపులకు స్పెషలిస్టు వైద్యులు కూడా వస్తున్నారనే విషయం ప్రజలకు తెలిసేలా చూడాలని చెప్పారు. ఆర్ధోపెడిక్ వైద్య నిపుణుడి అవసరం ఉందనే విజ్ఞప్తులు ప్రజల నుంచి బాగా వస్తున్నాయని, క్యాంపులలో వీలైనంతవరకు ఆర్ధో నిపుణులు కూడా ఉండేలా చొరవ చూపాలని సూచించారు.
ప్రణాళికాబద్ధంగా క్యాంపులు ఉండాలి
అన్ని గ్రామాలు, వార్డుల్లో జరిగే వైద్య శిబిరాలు ఒక ప్రణాళిక ప్రకారం ఉండాలని చెప్పారు. టోకెన్ల పంపిణీ, కన్సల్టేషన్, పరీక్షలు, మందుల పంపిణీ, అవసరమైన రోగులను పెద్ద ఆస్పత్రులకు సిఫారుసు చేయడం.. ఇదంతా ఒక క్రమపద్ధతిన జరగాలని చెప్పారు. రోగులు ఎక్కువ సమయం శిబిరాల వద్దనే నిరీక్షించకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అన్ని శిబిరాల్లో రోగుల సమయం వృధా కాకుండా చూడాలని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఆన్ని వైద్య ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన కల్పించేలా వీడియోలు, కరపత్రాలు, బ్యానర్లు లాంటివి వైద్య శిబిరాల్లో ఏర్పాటుచేసేలా చర్యలు తీసుకుకోవాలని చెప్పారు.
క్షేత్రస్థాయి పరిశీలన తప్పనిసరి
జిల్లాల వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, శాఖ ఉన్నతాధికారులు జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలను క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని చెప్పారు. సదుపాయాలకు లోటు లేకుండా చూసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ ఆశయం నెరవేరేలా చేయాలంటే క్షేత్రస్థాయి పరిశీలనలను తప్పనిసరి అని చెప్పారు. తాను సైతం మెడికల్ క్యాంపులు జరుగుతున్నతీరును క్షేత్రస్థాయిలో వచ్చి పరిశీలిస్తానని తెలిపారు. ప్రభుత్వానికి గొప్ప పేరు తీసుకొచ్చేలా మనమంతా పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ జె.నివాస్, ఆరోగ్యశ్రీ సీఈవో హరీంద్రప్రసాద్, డీహెచ్ డాక్టర్ రామిరెడ్డి, ఎన్ హెచ్ఎం స్టేట్ ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ వెంకట రవికృష్ణ, సిఎవో గణపతి రావు, జగనన్న ఆరోగ్య సురక్ష స్టేట్ నోడల్ ఆఫీసర్ శ్యామల తదితరులు పాల్గొన్నారు.