నెలాఖరుకల్లా శ్రీశైలానికి కృష్ణమ్మ!

Krishna River Water To Srisailam By The End Of June - Sakshi

ఆల్మట్టి జలాశయంలోకి పెరిగిన వరద

85.68 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ 

సాక్షి, అమరావతి: పశ్చిమ కనుమల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల కృష్ణా నదిలో వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. గతేడాది కంటే ఈ ఏడాది ఎగువన ప్రాజెక్టులు ముందే నిండే అవకాశముండటంతో.. ఈ నెలాఖరుకల్లా శ్రీశైలానికి వరద ప్రవాహం చేరే అవకాశముందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. మంగళవారం ఆల్మట్టి జలాశయంలోకి 1.55 లక్షల క్యూసెక్కులు వచ్చి చేరాయి. దీంతో నీటి నిల్వ 85.68 టీఎంసీలకు పెరిగింది. నారాయణపూర్‌ జలాశయంలో నీటి నిల్వ 25 టీఎంసీలకు చేరుకుంది. ఈ రెండు జలాశయాలు నిండటానికి 56 టీఎంసీలు అవసరం.

వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే మరో 4 రోజుల్లో ఆ ప్రాజెక్టులు నిండుతాయి. అప్పుడు ఆ ప్రాజెక్టుల గేట్లు ఎత్తి ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తారు. ఈ వరద ప్రవాహం జూరాల మీదుగా నెలాఖరుకల్లా శ్రీశైలం ప్రాజెక్టుకు చేరే అవకాశముందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు తుంగభద్రలో వరద ప్రవాహం కాస్త తగ్గింది. తుంగభద్ర డ్యామ్‌లోకి 36 వేల క్యూసెక్కులు వచ్చి చేరడంతో.. నీటి నిల్వ 25 టీఎంసీలకు చేరుకుంది. ఈ డ్యామ్‌ నిండాలంటే ఇంకా 75 టీఎంసీలు అవసరం. బీమా నదిలో వరద ప్రవాహం ప్రారంభమైంది. ఉజ్జయిని ప్రాజెక్టులోకి 5,611 క్యూసెక్కులు వచ్చి చేరడంతో.. నీటి నిల్వ 56.71 టీఎంసీలకు పెరిగింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top