ఉద్యోగుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నారు
హక్కులను హరిస్తున్నారు
పెండింగ్లో ఉన్న ఇంక్రిమెంట్లు తక్షణమే విడుదల చేయాలి.. పదోన్నతులు కల్పించాలి
సచివాలయ ఉద్యోగులను ఇతర శాఖల్లోకి డిప్యుటేషన్ మీద కాకుండా శాశ్వత ప్రాతిపదికన విలీనం చేయాలి
15 రోజుల్లోగా సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్త నిరసనలకు సిద్ధం
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ నేత మధుబాబు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పట్ల కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అత్యంత దారుణంగా ఉందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నీటి మూటలయ్యాయని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ నాయకుడు, విలేజీ సర్వేయర్స్ రాష్ట్ర అధ్యక్షుడు బూరాడ మధుబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వలంటీర్లు లేని లోటును భర్తీ చేయడానికి 1.32 లక్షల మంది సచివాలయ ఉద్యోగులను అడ్డంగా వాడుకుంటున్నారే తప్ప, కనీస హక్కులను పట్టించుకోవడం లేదన్నారు. ఇంక్రిమెంట్లు, కనీసం బేసిక్ పే సవరణ కూడా లేకుండా పోయిందని పేర్కొన్నారు.
మరోవైపు డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉద్యోగంలో చేరిన తమకు మరుగుదొడ్లు, పెట్రోల్ బంకుల వద్ద డ్యూటీలు వేయడం తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే అవుతుందన్నారు. సమస్యలు చెప్పుకుందామంటే ఉప ముఖ్యమంత్రి, మంత్రులు అవకాశమే ఇవ్వడం లేదని పేర్కొన్నారు.
పెండింగ్లో ఉన్న ఇంక్రిమెంట్లు తక్షణమే విడుదల చేయాలని, పదోన్నతులు కల్పించాలని.. సచివాలయ ఉద్యోగులను ఇతర శాఖల్లోకి డిప్యుటేషన్ మీద కాకుండా, శాశ్వత ప్రాతిపదికన విలీనం చేయాలని డిమాండ్ చేశారు. 15 రోజుల్లో సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యాప్త నిరసనలకు సిద్ధమవ్వనున్నట్టు పేర్కొన్నారు. ఉద్యోగులు ‘చలో విజయవాడ’, నిరాహార దీక్షలకు పూనుకుంటామని పేర్కొన్నారు.


