గంగాధర నెల్లూరు: టీడీపీ కూటమి నేతల వేధింపులు తాళలేక ఓ వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం రామానాయుడుపల్లిలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. రామానాయుడుపల్లికి చెందిన వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు బాబు (50) సోమవారం ఉదయం తన ఇంటివద్ద పురుగు మందు తాగి దగ్గుతుండగా గ్రామస్తులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు.
చికిత్స పొందుతుండగా బాబు మృతిచెందాడు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి స్థానిక నేతలు తనను వేధిస్తున్నట్టు సూసైడ్ నోట్లో రాసి ఉంది. గ్రామంలో ఓ భూ వివాదంపై అధికార పార్టీ నేతలు తనపైన, మరికొందరిపైన పలు కేసులు నమోదు చేయించారని నోట్లో మృతుడు పేర్కొన్నారు. తాను వైఎస్సార్సీపీ సానుభూతిపరుడిని కావడం వల్లే కేసులు నమోదు చేసి పోలీస్ స్టేషన్లు, కోర్టులచుట్టూ తిప్పుతుండటంతో ఆ వేధింపులు భరించలేక బలవన్మరణానికి పాల్పడుతున్నట్టు ఆ లేఖలో బాబు వివరించాడు.


