
ఒంగోలు ట్రిపుల్ ఐటీలో అక్రమంగా పదోన్నతులు
గవర్నింగ్ కౌన్సిల్ ఉత్తర్వులు లేకుండానే ప్రమోషన్లు
గెస్ట్ ఫ్యాకల్టీలకు అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా డిజిగ్నేషన్లో మార్పులు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు ట్రిపుల్ ఐటీ అక్రమాలకు అడ్డాగా మారింది. టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దల అండదండలతో ఇందులోని అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. ఇక్కడ నిబంధనలకు వ్యతిరేకంగా కొందరు గెస్ట్ ఫ్యాకల్టీలు అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు కొట్టేశారు. ఇప్పుడు వీరు విద్యార్థుల భవిష్యత్తును గాలికొదిలేసి గ్రూపు రాజకీయాలు చేస్తున్నారనే విమర్శలున్నాయి.
అడ్డదారుల్లో 40 మందికి పదోన్నతులు..
ట్రిపుల్ ఐటీలో 2017లో టీచింగ్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్ విడుదలైంది. ఎలాంటి రాత పరీక్షలు లేకుండా, రికమండేషన్ ద్వారా 40 మంది గెస్ట్ ఫ్యాకల్టీలుగా రిక్రూట్ అయ్యారు. ఏడాది తిరగకుండానే వీరిలో నలుగురికి మినహా మిగిలిన వారందరికీ 2018లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు వచ్చేశాయి. అధికారిక ఉత్తర్వులు, గవర్నింగ్ కౌన్సిల్ ఆమోదంలేకుండానే వీరి డిజిగ్నేషన్ మార్చేశారు. గెస్ట్ ఫ్యాకల్టీల్లో ఒకరు అప్పుడు అడ్మినిస్ట్రేటివ్ హోదాలో పదోన్నతులకు బరితెగించినట్లు ఆరోపణలున్నాయి.
ఆనాడు అసిస్టెంట్ ప్రొఫెసర్ హోదా పొందిన వారంతా ప్రస్తుతం ఏవోగా, ఫైనాన్షియల్ ఆఫీసర్ (ఎఫ్ఓ)గా, స్టూడెంట్ వెల్ఫేర్ డీన్గా, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్గా ప్రత్యేక హోదాలను అనుభవిస్తున్నారు. ఆ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కు స్నేహితుడైన ఓ వ్యక్తిని అడ్డదారుల్లో గెస్ట్ ఫ్యాకల్టీగా తీసుకొచ్చి అసిస్టెంట్ ప్రొఫెసర్ను చేసి స్టోర్స్ పర్చేజ్ ఇన్చార్జిగా కూడా అదనపు బాధ్యతలప్పగించారు.
అండగా నిలిచిన జగన్ సర్కారు..
ట్రిపుల్ ఐటీలో 2018లో కాంట్రాక్టు టీచింగ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈసారి మాత్రం నిబంధనల ప్రకారం ఎంపిక ప్రక్రియ నడిపారు. ఇందులో సెలెక్ట్ అయిన వారిని తొలగించాలన్న కుట్రతో ఎల్లో గ్యాంగ్ 2019లో వీరిని సాగనంపి మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు రావాలని చెప్పినట్లు సమాచారం. అప్పుడే అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం వీరిని కొనసాగించడంతో ఎల్లో గ్యాంగ్ పప్పులు ఉడకలేదు.
అయినప్పటికీ ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారమిచ్చి కోవిడ్ సమయంలో వీరిని నిలిపివేశారు. విషయం తెలుసుకున్న నాటి సీఎం వైఎస్ జగన్ వారికి న్యాయం చేసి ఉద్యోగాల్లో కొనసాగించారు. ట్రిపుల్ ఐటీలోని కాంట్రాక్టు ఉద్యోగులందరికీ జీతాలు పెంచుతూ జీవో ఇవ్వగా దాన్ని కూడా ఎల్లో గ్యాంగ్ దురి్వనియోగం చేసింది. 2017లో ఎంపికై గెస్ట్ ఫ్యాకల్టీలుగానే మిగిలిపోయిన నలుగురికి.. 2018లో నిబంధనల ప్రకారం ఎంపికైన కాంట్రాక్టు ఫ్యాకల్టీలకు జీతాలు పెంచకుండా కుట్రలు చేసినట్లు ఆరోపణలున్నాయి.
నేడు కాంట్రాక్టు ఉద్యోగుల ధర్నా
ఒంగోలు ట్రిపుల్ ఐటీలో జరుగుతున్న అక్రమాలతో అన్యాయానికి గురైన కాంట్రాక్టు ఉద్యోగులు సోమవారం నూజీవీడు ప్రధాన కార్యాలయం వద్ద ధర్నా చేయనున్నారు. మరోవైపు.. ట్రిపుల్ ఐటీ కాలేజీలో తిష్టవేసిన ఎల్లో గ్యాంగ్ ఆగడాలను అరికట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఓ మంత్రి అండదండలతో వీరు రెచ్చిపోతున్నారన్న ఆరోపణలున్నాయి. విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా రాజకీయాలకు పాల్పడుతున్నారన్న విమర్శలూ ఉన్నాయి.
డిజిగ్నేషన్ మార్పు నేరుగా చేయకూడదు..
ఇది ఎప్పట్నుంచో ఉన్న సమస్య. సాంకేతిక కారణాలవల్ల దీనిపై ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. గత నెల 28న గవరి్నంగ్ కౌన్సిలింగ్ సభ్యుల సమావేశం జరిగింది. గెస్ట్ ఫ్యాకల్టీలకు అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా డిజిగ్నేషన్ మార్పు నేరుగా చేయకూడదని, ఇంటర్నల్ కమిటీ వేసిన తర్వాతే చేయాలన్న సూచనలున్నాయి. అయితే, 110 జీఓ ద్వారా 2018 ఫ్యాకల్టీల సమస్యలు పరిష్కరించాలని నిర్ణయం తీసుకున్నందున ధర్నా జరగకపోవచ్చు. – డాక్టర్ భాస్కర్ పటేల్, డైరెక్టర్, ట్రిపుల్ ఐటీ, ఒంగోలు