దీనిపై సర్క్యులర్, జగద్గురువుల ప్రామాణికతను అమలు చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం, దేవదాయ శాఖ అధికారులకు హైకోర్టు ఆదేశం
సాక్షి, అమరావతి: అర్చకులు దేవస్థానాల ప్రధాన గర్భాలయంలోకి ప్రవేశించే విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దేవదాయ శాఖ పరిధిలోని దేవాలయాల్లో పనిచేసే ఏ అర్చకుడైనా విదేశీయానం చేసి వస్తే, అతన్ని ప్రధాన ఆలయ గర్భాలయంలో అర్చకత్వం (పూజా కార్యక్రమాలు) నిర్వహించడానికి అనుమతించరాదంటూ 2010లో జారీ చేసిన సర్క్యులర్ను, అలాగే 2024లో శృంగేరి శారదాపీఠం జగద్గురువులు శ్రీశ్రీశ్రీ మహాతీర్థ భారతీ స్వామి జారీ చేసిన ప్రామాణికతను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సంప్రదాయాలకు విరుద్ధంగా జుట్టు కత్తిరించుకున్న వారు గర్భాలయంలోకి ప్రవేశించరాదని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.
విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో పలువురు ప్రదాన అర్చకులు విదేశీయానం చేసి వచ్చారని, అయినా కూడా వారిని ప్రధాన గర్భాలయంలో అర్చకత్వం నిర్వహణకు దేవదాయ శాఖ అధికారులు అనుమతిస్తున్నారని పేర్కొంటూ ఆ దేవస్థానంలో శ్రీచక్ర నవావరణ అర్చన పారాయణదారుగా పనిచేస్తున్న డిఎస్ఎస్ఎస్ సుబ్రహ్మణ్యం సోమయాజీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది కేఆర్ శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ, అర్చకత్వం విషయంలో ప్రస్తుత దేవదాయ శాఖ నిబంధనలు, ఏపీ ధార్మిక పరిషత్తు జారీ చేసిన సర్క్యులర్, అలాగే 2024 డిసెంబర్ 12న శ్రీ శారదాపీఠం జగద్గురువులు శ్రీశ్రీశ్రీ మహాతీర్థ భారతీ స్వామి జారీ చేసిన ప్రామాణిక మార్గదర్శకాలను తూచా తప్పకుండా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.


