2005లో చార్జిమెమో ఇచ్చి 2015లో చర్యలా?
శాఖాపరమైన చర్యల్లో అసాధారణ జాప్యం చెల్లదు : హైకోర్టు
సాక్షి, అమరావతి: ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకునే విషయంలో అసాధారణ జాప్యం తగదని హైకోర్టు స్పష్టం చేసింది. ఓ ఉద్యోగికి 2005లో చార్జిమెమో ఇచ్చి, 2015లో అతనిపై చర్యలు తీసుకునేందుకు వీలుగా షోకాజ్ నోటీసులివ్వడాన్ని తప్పుపట్టింది. అది కూడా ఆ ఉద్యోగి పదవీ విరమణ చేసిన ఏడేళ్లకు షోకాజ్ నోటీసులివ్వడంపై విస్మయం వ్యక్తంచేసింది. తీరిక ఉన్నప్పుడు చర్యలు తీసుకుంటామంటే కుదరదని, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు సైతం స్పష్టం చేసిందని హైకోర్టు గుర్తు చేసింది.
ఓ విషయంలో స్పష్టత కోసం ఉన్నతాధికారులకు లేఖలు రాశామని, ఈ ప్రక్రియ కారణంగానే ఐదేళ్ల జాప్యం జరిగిందన్న అధికారుల వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. 2005లో ఆ ఉద్యోగికి అధికారులు జారీ చేసిన చార్జిమెమోను, 2015లో జారీ చేసిన షోకాజ్ నోటీసును హైకోర్టు రద్దు చేసింది. ఈ విషయంలో ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్రాయ్, జస్టిస్ వెణుతురుమల్లి గోపాలకృష్ణారావు ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది.
2010లో విచారణ పూర్తి.. 2015లో షోకాజ్ నోటీసులు..
శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేవీవీ సత్యనారాయణమూర్తి వ్యవసాయశాఖాధికారి. అరకు అటవీశాఖలో డిప్యుటేషన్పై అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న సమయంలో సత్యనారాయణమూర్తిపై విధి నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించారంటూ ఆరోపణలొచ్చాయి. ఈ విషయంపై ఉన్నతాధికారులు అతనికి 2005లో చార్జిమెమో ఇచ్చారు. దీనికి ఆయన వివరణ ఇచ్చారు. వివరణ సంతృప్తికరంగా లేదంటూ విచారణకు ఆదేశించారు. 2010లో విచారణను ముగించారు. నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలు రుజువు కాలేదని విచారణలో తేల్చారు.
విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని విచారణాధికారి తన నివేదికలో పేర్కొన్నారు. విచారణ జరుగుతుండగానే 2008 డిసెంబర్ 12న సత్యనారాయణమూర్తి పదవీ విరమణ చేశారు. 2015లో సత్యనారాయణమూర్తికి షోకాజ్ నోటీసులిచ్చి, పెనాల్టీ ఎందుకు విధించకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ షోకాజ్ నోటీసులను సవాలు చేస్తూ సత్యనారాయణమూర్తి ఏపీ పరిపాలన ట్రిబ్యునల్ (ఏపీఏటీ)ను ఆశ్రయించారు. విచారణ జరిపిన ట్రిబ్యునల్.. 2005లో జారీ చేసిన చార్జిమెమోను, 2015లో జారీ చేసిన షోకాజ్ నోటీసులను రద్దు చేసింది. ఈ తీర్పును సవాలు చేస్తూ వ్యవసాయ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, వ్యవసాయ శాఖ డైరెక్టర్ హైకోర్టులో 2017లో పిటిషన్ దాఖలు చేశారు.