చిత్తూరు అర్బన్: స్టాక్ మార్కెట్ పేరిట పలువురిని బురిడీ కొట్టించిన కేసులో ఓ మహిళను కర్ణాటక పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అందించిన వివరాల మేరకు.. బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో దుర్గాప్రసాద్ అనే వ్యక్తి వైద్యుడిగా పని చేస్తున్నారు. చిత్తూరు నగరం కొంగారెడ్డి పల్లెలోని శ్రీనివాస నగర్కు చెందిన చైతన్య, అతని భార్య హైమావతి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి భారీగా లాభాలు తీసుకొస్తామంటూ దుర్గాప్రసాద్ను నమ్మించారు.
గతేడాది నుంచి పలు దఫాలుగా దుర్గాప్రసాద్ నుంచి రూ.15 కోట్లు తీసుకున్నారు. భారీగా వడ్డీ చెల్లిస్తామని చెప్పి మోసం చేశారు. ఎంతకూ డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితుడు బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో బెంగళూరు పోలీసులు చిత్తూరు వచ్చారు. ప్రధాన నిందితుడు చైతన్య పారిపోగా అతని భార్య హైమావతిని అదుపులోకి తీసుకొని బెంగళూరు తరలించారు.


