పదే పదే ‘మెగా’ అబద్ధం! | Government misinformation campaign against candidates who cheated in DSC 2025 | Sakshi
Sakshi News home page

పదే పదే ‘మెగా’ అబద్ధం!

Jun 7 2026 4:44 AM | Updated on Jun 7 2026 4:44 AM

Government misinformation campaign against candidates who cheated in DSC 2025

డీఎస్సీ–2025లో దగాపడ్డ అభ్యర్థులపై సర్కారు దుష్ప్రచారం 

1:1 నిష్పత్తికి వక్రభాష్యం.. ఒక పోస్టుకు ఒక్కరినే పిలిచారంటే ఎంపికైనట్టే కదా.. అభ్యర్థుల ప్రశ్నలకు సమాధానం కరువు

కాల్‌ లెటర్‌ పంపారంటే జాబు వచ్చినట్టు కాదా?

పేపర్‌ లీకేజీపైనా సమాధానం చెప్పని ప్రభుత్వం 

ఎస్సీఈఆర్టీ కాంట్రాక్టు అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగికి రెండు టాప్‌ ర్యాంకులు ఎలా వచ్చాయి?

సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ–2025లో తప్పు­లను కప్పిపుచ్చి కూటమి ప్రభుత్వం నష్టపోయిన అభ్యర్థులను భయపెట్టే ప్రయత్నం చేస్తోంది. ఆధారాలతో సహా అక్రమాలు బయటపడినా, ఎక్కడా తప్పు జరగలేదని, తప్పంతా అభ్యర్థులదే అన్నట్టుగా బుకాయిస్తోంది. ‘ఒక పోస్టుకు ఒక అభ్యర్థిని (1:1 నిష్పత్తి) మాత్రమే’ సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచి, ఇప్పుడు ఆ విధానానికే వక్రభాష్యం చెబుతోంది. ఒక పోస్టుకు ఒక్కరినే పిలవడం అంటే అర్థం ఏమిటని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. కాల్‌ లెటర్లు పంచారంటే ఉద్యోగం వచ్చినట్లే కదా.. అని నిలదీస్తున్నారు.

మెరిట్‌ అభ్యర్థులకు మాత్రమే కాల్‌లెటర్లు పంపామని చెబుతున్నప్పుడు.. ఎంపిక జాబితా లేదా తిరస్కరణ జాబితాలో ఏదో ఒకదాంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన వారిని ఆ రెండు లిస్టుల్లోనూ ఎందుకు చూపలేదన్న ప్రశ్నకు అటు ప్రభుత్వం గాని, ఇటు అధికారులు గాని సరైన సమాధానం చెప్పడం లేదు. అంతా వదిలేసి హారిజాంటల్‌ రిజర్వేషన్‌ అమలును అర్థం చేసుకోలేకపోతున్నారని చెప్పడంపై నిపుణులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 

వాస్తవానికి ఎస్సీఈఆర్టీ కాంట్రాక్టు అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగికి రెండు టాప్‌ ర్యాంకులు ఎలా వచ్చాయి?, అతన్ని ఎందుకు కౌన్సెలింగ్‌కు రాకుండా అడ్డుకున్నారో తేల్చడం లేదు. చేసిన తప్పులను వదిలేసి బాధిత అభ్యర్థులదే తప్పు అన్నట్టు దుష్ప్రచారం చేయడం విస్తుగొల్పుతోంది. జరిగిన తప్పులపై విచారణ చేయాల్సిన ప్రభుత్వం అభ్యర్థులపై ఎదురుదాడి చేయడం ఆందోళన కలిగిస్తోంది. 

వీరందరినీ ఎందుకు పిలిచారు? 
కూటమి ప్రభుత్వంలో ఏపీపీఎస్సీ వివిధ ఉద్యోగాల భర్తీకి 1:1 నిష్పత్తిలోనే ఫలితాలు విడుదల చేస్తోంది. పరీక్షల అనంతరం ఆ అభ్యర్థుల మెరిట్, వర్టికల్, హారిజాంటల్‌ రిజర్వేషన్‌ పరిశీలించిన తర్వాతనే 1:1 నిష్పత్తిలో ఫలితాలను ప్రకటిస్తుంది. అంటే.. ఫలితాల్లో ఉన్న అభ్యర్థులంతా దాదాపు ఎంపికైనట్లే. సర్టిఫికెట్ల పరిశీలనలో ఏమైనా పొరపాట్లు ఉంటే సరైన పత్రాలు అందించేందుకు నిర్ణీత గడువు ఇస్తారు. ఆలోగా సదరు అభ్యర్థి అన్ని పత్రాలు సరైనవేనని నిరూపించుకుంటే ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. లేదంటే అతని తర్వాత ఉన్నవారిని పిలుస్తారు. 1:1 నిష్పత్తి ఇలాగే కొనసాగుతుంది. 

కానీ డీఎస్సీలో మాత్రం ఈ విధానం పాటించకుండా విచ్చలవిడిగా తప్పులు చేసి ఇప్పుడు నష్టపోయిన అభ్యర్థులదే తప్పు అని బుకాయిస్తున్నారు. డీఎస్సీ ప్రక్రియలో 1:1 నిష్పత్తిలో సర్టిఫికెట్ల పరిశీలనకు వచ్చి అన్నీ సక్రమంగా ఉండి కూడా అటు ఎంపిక జాబితాలో ఇటు తిరస్కరణ జాబితాలోనూ లేకుండా ఉన్నవారు దాదాపు 1,500 మంది అభ్యర్థులు ఉన్నారు. మెరిట్‌లో లేకుంటే వీరందరినీ ఎందుకు సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచారు? పై రెండు జాబితాల్లోనూ ఎందుకు చూపలేదు? ఈ ప్రశ్నకు మాత్రం ప్రభుత్వం వద్ద సమాధానం లేదు.

వైఎస్సార్‌ కడప జిల్లా రాయచోటికి చెందిన పుష్పాంజలికి ప్రభుత్వం పంపిన కాల్‌ లెటర్‌ 

వైఎస్సార్‌ కడప జిల్లా రాజుపాలేనికి చెందిన హైమావతికి ప్రభుత్వం పంపిన కాల్‌ లెటర్‌ 

ఆ ర్యాంకర్‌ వివరాలు తొలగించి.. 
డీఎస్సీ ఫలితాలు విడుదలలో భాగంగా తొలుత సబ్జెక్టు వారీగా, జిల్లాల వారీగా మెరిట్‌ లిస్టు ప్రకటిస్తారు. మెగా డీఎస్సీ–2025లోనూ ఇందుకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో కృష్ణా జిల్లా సోషల్‌ స్టడీస్‌ టాపర్‌గా డీఎస్సీ నిర్వహణలో కీలకపాత్ర పోషించిన ఎస్సీఈఆర్టీ కాంట్రాక్టు ఉద్యోగి నవీన్‌ నిలిచాడు. ఇతను సోషల్‌ స్టడీస్‌లో మొదటి ర్యాంకు, టీజీటీ (తెలుగు) జోన్‌–2లో ఆరో ర్యాంకు సాధించాడు. అయితే, తొలుత అతడి వివరాలతో మెరిట్‌ లిస్టు విడుదల చేశారు. 

అనంతరం ఈ విషయం బయటకు రాకూడదని ఆ లిస్టులను రద్దు చేసి, రెండో ర్యాంకు నుంచి రెండో లిస్టు విడుదల చేశారు. ఎంపిక జాబితాలో తన పేరు లేకపోవడంతో నవీన్‌ ఆధారాలతో సహా హైకోర్టును ఆశ్రయించాడు. నిబంధనల ప్రకారం కాంట్రాక్టు ఉద్యో­గు­లను కీలకమైన డీఎస్సీ నిర్వహణలో నియమించరాదు. 

కానీ ఇక్కడ మాత్రం ఆన్‌లైన్‌ ప్రశ్నలు అప్‌లోడ్‌ చేసే బాధ్యతను కాంట్రాక్టు ఉద్యోగికే అప్పగించినట్టు తీవ్రమైన ఆరోపణలు­న్నాయి. ఫలి­తాల్లో అతడు టాపర్‌గా నిలిచినా పోస్టు ఇవ్వకుండా, అతడి క్యాండిడేట్‌ లాగిన్‌ ఐడీని బ్లాక్‌ చేశారు. వాస్తవానికి ఎస్సీఈఆర్టీ నుంచి ప్రశ్నలు బయటకు వెళ్లిపోయాయన్న ఆరోపణలపైనా చంద్రబాబు ప్రభుత్వం దర్యాప్తు చేయకపోగా తప్పుడు ఆరో­పణలు చేయడం అనుమానాలకు తావిస్తోంది.

సీబీఐ విచారణ చేయాలి
మెగా డీఎస్సీ–2025 నియామకాల్లో అనేక అవకతవకలు జరిగినట్టు నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. అధికారులు మాత్రం పారదర్శకంగా జరిగినట్టు వివరణ ఇవ్వడం హాస్యాస్పదమని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంబేటి రామచంద్ర విమర్శించారు.  డీఎస్సీ–2025 చాలా మందికి చివరి అవకాశంగా కష్టపడి చదివి మెరిట్‌ సాధించారని, అలాంటి వారికి సైతం ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని దుయ్యబట్టారు. డీఎస్సీలో జరిగిన దారుణాలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్‌ చేశారు.

హారిజాంటల్‌లో ఒక్కటి.. నింపింది రెండు
చిత్తూరు జిల్లాకు చెందిన బాధిత అభ్యర్థి ఎం.ఏకాంబరం (బీసీ–డీ 125 ర్యాంకు) ఘటనను తీసుకుంటే.. ఈ జిల్లాలో స్కూల్‌ అసిస్టెంట్‌ సోషల్‌ స్టడీస్‌ పోస్టులు బీసీ–డీ కేటగిరిలో 7 ఉన్నాయి. ఇందులో రెండు ఓపెన్‌లోను, 5 పోస్టులు లోకల్‌ మెరిట్‌కు కేటాయించారు. హారిజాంటల్‌లో ఐదింటిలో ఒకటి ఉమెన్‌కు కేటాయించారు. బీసీ–డీ విభాగం మెరిట్‌లో చివరి ర్యాంక్‌ 114 అని ఒకసారి, 116 అని మరోసారి అధికారులు ప్రకటించారు. దీనిప్రకారం చూస్తే్త 114 ర్యాంకు అభ్యర్థి ఎస్టీ అయినప్పటికీ బీసీ–డీలో చూపించారు. 

116 ర్యాంకు ఉమెన్, ఈమె మెరిట్‌ లిస్టులో ఎంపికైంది కాబట్టి ఇక హారిజాంటల్‌ రిజర్వేషన్‌లో కేటాయించిన ఒక పోస్టును తర్వాత మెరిట్‌లో ఉన్న ర్యాంకుకు కేటాయించాలి, అంటే 125 ర్యాంకు అభ్యర్థికి ఉద్యోగం ఇవ్వాలి. కానీ, జనరల్‌ మెరిట్‌లో ఉన్న ఏకాంబరాన్ని కాదని, రెండు పోస్టులను హారిజాంటల్‌లో స్పెషల్‌ కేటగిరీ అభ్యర్థులకు ఇచ్చారు. వాస్తవానికి బీసీ–డీలో ప్రకటించిన 7 పోస్టుల్లో వీరికి ఒక్క పోస్టు కూడా చూపలేదు. కానీ చట్ట ప్రకారం ఒక్క పోస్టునే ఇవ్వాల్సి ఉన్నా రెండు పోస్టులు ఇవ్వడం గమనార్హం.

చట్టాన్ని కాదని ఎస్టీ అభ్యర్థికి అన్యాయం
కడప జిల్లాలకు చెందిన ఎం.జగదీష్‌ నాయక్‌ విషయంలో ప్రభుత్వం చట్టానికి కొత్త అర్థం చెబుతోంది. ఎస్టీ కేటగిరీకి చెందిన జగదీష్‌ డీఎస్సీలో 363 ర్యాంకు సాధించారు. జిల్లాలో ఎస్జీటీ ఉర్దూ మీడియం (బ్యాక్‌లాగ్‌) 4 పోస్టులు ఉన్నాయి. ఇందులో 2 జనరల్, మరో 2 ఉమెన్‌ అభ్యర్థులకు కేటాయించారు. సర్టిఫికెట్ల పరిశీలన కోసం ముగ్గురిని మాత్రమే పిలిచారు. ఇందులో రెండు పోస్టులను మాత్రమే భర్తీ చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఒకరు మేల్, ఇంకొకరు ఫీమేల్‌గా పేర్కొన్నారు. ‘మిగిలిన రెండు పోస్టులను అర్హులైన ఎస్టీ ఉమెన్‌ అభ్యర్థులు లేక భర్తీ చేయలేదని’ ప్రకటించారు. 

» గతేడాది కూటమి ప్రభుత్వం మైన్స్‌ అండ్‌ జియా­లజీ శాఖలో రాయల్టీ ఇన్‌స్పెక్టర్‌ పోస్టు ఒకటి భర్తీకి (క్యారీఫార్వర్డ్‌) నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఈ పోస్టును ఎస్టీ మహిళకు కేటాయించారు. 1996లో జీఏడీ ఇ­చ్చిన జీవో 436 ప్రకారం హారిజాంటల్‌ రిజర్వే­షన్‌లో అర్హత గల మహిళా అభ్యర్థి లేకపోతే తర్వా­త మెరిట్‌లో ఉన్న పురుష ఎస్టీ అభ్యర్థిని పరిగ­ణనలోకి తీసుకోవాలి. ప్రస్తుతం డీఎస్సీలో అర్హత గల పురుష ఎస్టీ అభ్యర్థి జగదీష్‌ నాయక్‌ ఉన్నా, అతనికి ఉద్యోగం ఇవ్వకుండా అన్యాయం చేశారు.  

ఓసీ–ఈడబ్లు్యఎస్‌ పోస్టు బీసీకి ఎలా ఇస్తారు? 
అన్నమయ్య జిల్లా రాయ­చోటికి చెంది­న సయ్యద్‌ జ­మీల్‌ డీఎస్సీ ఎస్‌­ఏ బయలా­జికల్‌ సైన్స్‌ (ఉర్దూ మీడి­యం)లో 11వ ర్యాంకు సాధించా­రు. బయోలాజికల్‌ సైన్స్‌లో 2 పోస్టులు ఉండగా, ఒకటి ఓసీ–ఈడబ్ల్యూ­ఎస్‌కు రి­జర్వ్‌ చేశారు. ఇతనికంటే ముందున్న మరో అ­భ్యర్థి 7వ ర్యాంకులో ఉండటంతో పోస్టు­కు అతన్ని ఎంపిక చేశారు. వాస్తవానికి పోస్టుకు ఎంపికైన అభ్యర్థి (బీసీ–ఈ) ముస్లిం. ఇదే కేటగిరీలో 2008, 2012, 2014, 2018 డీఎస్సీలకు హాజర­య్యా­డు. 

2025లో అ­తడు ఓసీ­–ఈ­డబ్ల్యూ­ఎస్‌గా నమోదు చేసుకుని త­ప్పుడు కుల­ధ్రువీ­కరణ పత్రాలతో ఉ­ద్యోగం పొందాడు. ఇతనివి తప్పుడు పత్రాలని ఆధా­రాలతో సయ్యద్‌ జమీల్‌ నిరూపించినా అధికా­రులు పట్టించుకో­లేదు. బాధితుడు ఆధారా­లతో పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర కా­ర్యా­లయంలోని గ్రీవెన్స్‌ సెల్‌లో ఫిర్యాదు చేయగా ‘ఆరో­పణలు ఎదుర్కొంటున్న అభ్య­ర్థి సర్టిఫి­కెట్లు తప్పుడువని తహసీల్దార్‌తో రద్దు చేయించి రా.. అప్పుడు నీ ఉద్యోగం గురించి ఆలోచిస్తా’ అని ఓ అధికారి మాట్లాడా­రని వాపోయాడు.

Advertisement
 
Advertisement
Advertisement