
గోదావరి జలాల్లో ప్రమాదకర స్థాయిలో కాలుష్య తీవ్రత
ప్రమాణాలకు మించి బ్యాక్టీరియా
కేంద్ర జలసంఘం, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సంయుక్త అధ్యయనంలో వెల్లడి
శుద్ధి చేయని గోదావరి జలాలు తాగడం శ్రేయస్కరం కాదని స్పష్టీకరణ
జీవ నది గోదావరి కాలుష్య కోరల్లో చిక్కుకుంది. మానవ తప్పిదాల వల్ల గోదావరి జలాలు కలుషితమయ్యాయని.. ఈ నీటిని నేరుగా తాగడం శ్రేయస్కరం కాదని కేంద్ర జల సంఘం–కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి అధ్యయనం వెల్లడించింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిర్దేశించిన ప్రమాణాల కంటే గోదావరి జలాల్లో కాలుష్య తీవ్రత అధికంగా ఉన్నట్లు తెలిపింది.
సాక్షి, అమరావతి: గోదావరి నీటిని శుద్ధి చేయకుండా నేరుగా తాగడం శ్రేయస్కరం కాదా? నదీ జలాల్లో కాలుష్యం తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరుకుందా? మానవ తప్పిదాల వల్లే గోదావరి కాలుష్య కాసారంగా మారిందా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతోంది కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ)– కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) అధ్యయన నివేదిక. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) నిర్దేశించిన ప్రమాణాల కంటే గోదావరి జలాల్లో కాలుష్య తీవ్రత అధికంగా ఉన్నట్లు ఆ రెండు సంస్థల సంయుక్త అధ్యయనంలో వెల్లడైంది.
పశ్చిమ కనుమల్లో మహారాష్ట్రలోని సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో నాసిక్ జిల్లా త్రయంబకేశ్వర్ వద్ద సముద్రమట్టానికి 1,067 మీటర్ల ఎత్తులో జన్మించిన గోదావరి ప్రధాన పాయ మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా 1,465 కి.మీ.ల దూరం ప్రవహించి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. గోదావరి ప్రధాన పాయలో ఎడమ వైపు నుంచి పూర్ణ, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి.. కుడి వైపు నుంచి ప్రవర, మంజీర, మానేరు ప్రధాన ఉప నదులు కలుస్తాయి. గోదావరి నదీ పరీవాహక ప్రాంతం(బేసిన్) మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో 3,12,812 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. దేశ భౌగోళిక విస్తీర్ణంలో గోదావరి బేసిన్ 9.5 శాతం. దేశంలో అతి పెద్ద నదుల్లో గోదావరి రెండో స్థానంలో ఉంది.
జల కాలుష్యానికి ప్రధాన కారణాలు ఇవీ...
⇒ గోదావరి బేసిన్లో భారీ ఎత్తున పరిశ్రమలు విస్తరించి ఉన్నాయి. సాగు భూమి విస్తీర్ణమూ ఎక్కువే.
⇒ పారిశ్రామిక వ్యర్థాలను, వ్యర్థ జలాలను యథేచ్ఛగా గోదావరితోపాటు ఉప నదులు, వంకలు, వాగుల్లోకి వదిలేస్తున్నారు.
⇒ పంటల సాగులో మోతాదుకు మించి రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వినియోగిస్తున్నారు. వర్షపు నీటితో రసాయన ఎరువులు, క్రిమిసంహారక ముందులు కలిసి గోదావరిని కలుషితం చేస్తున్నాయి.
⇒ గోదావరి బేసిన్లోని నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో మురుగునీటిని శుద్ధి చేయకుండా యథేచ్ఛగా వదిలేస్తుండటం వల్ల ఆ జలాలు వర్షపు నీటితో కలిసి గోదావరిలోకి చేరుతున్నాయి.
⇒ పశ్చిమ కనుమల్లో భారీ ఎత్తున అడవులను నరికివేస్తుండటంతో భూమి కోతకు గురవుతోంది. అడ్డగోలుగా గనులను తవ్వేస్తుండటం వల్ల వర్షపు నీటి ద్వారా కాలుష్యం గోదావరికి చేరుతోంది.
⇒ వీటన్నింటినీ పరిశీలిస్తే కేవలం మానవ తప్పిదాల వల్లే గోదావరి నది కాలుష్య కాసారంగా మారినట్లు స్పష్టమవుతోంది.

నేరుగా తాగితే రోగాలే..
బీఐఎస్ ప్రమాణాల ప్రకారం తాగే నీటిలో ఫీకల్ కోలీఫామ్(ప్రమాదకర బ్యాక్టీరియా) ఆనవాళ్లు ఉండకూడదు. కానీ, గోదావరి జలాల్లో ఫీకల్ కోలీఫామ్ మిల్లీలీటర్కు మూడు నుంచి నాలుగు వరకూ ఉన్నట్లు మార్చి నెలలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి నిర్వహించిన పరీక్షల్లో వెల్లడైంది. ఇక టోటల్ కోలీఫామ్(బ్యాక్టీరియా) లీటర్ నీటిలో 50 లోపు ఉండొచ్చు. గోదావరి జలాల్లో మాత్రం లీటర్ నీటిలో 64 నుంచి 120 బ్యాక్టీరియాలు ఉన్నట్లు తేలింది.
బీఐఎస్ ప్రమాణాల ప్రకారం లీటర్ నీటిలో ఘనవ్యర్థాలు(టీడీఎస్) 0.5 గ్రాములు కలిసి ఉన్నప్పటికీ ఆ నీటిని తాగవచ్చు. గోదావరి జలాల్లో లీటర్ నీటిలో నరసాపురం, ఎదుర్లంక వద్ద 24.344 నుంచి 31.428 గ్రాముల మేర ఘనవ్యర్థాలు కరిగినట్లు పరీక్షల్లో వెల్లడైంది. సంప్రదాయ పద్ధతుల్లో గోదావరి జలాలను శుద్ధి చేయకుండా తాగితే కలరా, మలేరియా వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బీఐఎస్ ప్రమాణాల మేరకు తాగునీటికి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్దేశించిన ప్రమాణాలు
1.పీహెచ్ 6.5 నుంచి 8.5 శాతం లోపు ఉండొచ్చు (పీహెచ్ 7 ఉంటే స్వచ్ఛమైన నీటి కింద లెక్క)
2.డిజాల్వ్డ్ ఆక్సిజన్ (డీవో) లీటర్ నీటిలో 6 మిల్లీ గ్రాముల కంటే ఎక్కువ ఉండాలి
3.బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీవోడీ) లీటర్ నీటికి 2 మిల్లీ గ్రాముల్లోపు ఉండొచ్చు
4.టోటల్ కోలీఫామ్ (బ్యాక్టీరియా) 100 మిల్లీ లీటర్ల నీటిలో 50లోపు ఉండొచ్చు
5.ఫీకల్ కోలీఫామ్(ఎఫ్సీ) అనేది ప్రమాదకర బ్యాక్టీరియా. ఇది 100 మిల్లీలీటర్లకు ఒక్కటి కూడా ఉండకూడదు
6.టీడీఎస్(టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్) లీటర్ నీటికి 500 మిల్లీగ్రాములలోపు ఉండొచ్చు