
పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో సీఎం ఆదేశం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెట్టుబడులపై ఒప్పందం చేసుకున్న పరిశ్రమలు వెంటనే స్థాపించేలా చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఆమోదం తెలిపిన, ఒప్పందాలు చేసుకున్న ప్రాజెక్టుల పురోగతిని నిత్యం పరిశీలించాలన్నారు. గురువారం సచివాలయంలో పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) సమావేశం జరిగింది. అధ్యక్షత వహించిన సీఎం చంద్రబాబు గత ఎస్ఐపీబీ సమావేశాల్లో ఆమోదం పొందిన ప్రాజెక్టులు, వాటి పురోగతిపై సమీక్ష జరిపారు.
పరిశ్రమలు, విద్యుత్, పర్యాటకం వంటి రంగాల్లో మొత్తం 10 సంస్థలు రూ.1,21,659 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకురాగా సమావేశం ఆమోదం తెలిపింది. తద్వారా 80,104 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయని అధికారులు తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎఈ పార్క్ చొప్పున మొత్తం 175 ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.
తొలివిడతగా జిల్లాకు ఒకటి చొప్పున 26 జిల్లాల్లో తక్షణం 26 ఎంఎస్ఎంఈ పార్కులు నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే ప్రతిపాదించిన రతన్టాటా ఇన్నోవేషన్ కేంద్రాలను నెల రోజుల్లో 5 సెంటర్లు నెలకొల్పాలని కోరారు.
ఎస్ఐపీబీ ఆమోదించిన ప్రాజెక్టుల వివరాలివీ
1. ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్: నాయుడుపేటలో రూ.1,742 కోట్ల పెట్టుబడులు, 2 వేల ఉద్యోగాలు.
2. దాల్మియా సిమెంట్స్: వైఎస్సార్ జిల్లాలో రూ.2,883 కోట్ల పెట్టుబడులు, 354 ఉద్యోగాలు.
3. లులూ గ్లోబల్ ఇంటర్నేషనల్: విశాఖపట్నంలో రూ.1,500 కోట్ల పెట్టుబడులు.
4. సత్యవేడు రిజర్వ్ ఇన్ఫ్రాసిటీ ప్రైవేట్ లిమిటెడ్: శ్రీసిటీలో రూ.25 వేల కోట్ల పెట్టుబడులు, 50 వేల ఉద్యోగాలు.
5. ఇండోసాల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్: రూ.58,469 కోట్ల పెట్టుబడులు, 13,050 ఉద్యోగాలు.
6. బాలాజీ యాక్షన్ బిల్డ్వెల్ ప్రైవేట్ లిమిటెడ్: రూ.1,175 కోట్లు, 1,500 ఉద్యోగాలు.
7. ఏపీ ఎన్జీఈఎల్ హరిత్ అమ్రిత్ లిమిటెడ్: అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో రూ.22 వేల కోట్ల పెట్టుబడులు, 8,300 ఉద్యోగాలు.
8. ఆస్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్: అన్నమయ్య, కడప జిల్లాలు, రూ.8,240 కోట్లు, 4 వేల ఉద్యోగాలు.
9. మేఫెయిర్ బీచ్ రిసార్ట్స్, కన్వెన్షన్: రూ.400 కోట్ల పెట్టుబడులు, 750 ఉద్యోగాలు.
10. ఒబేరాయ్ విలాస్ రిసార్ట్: రూ.250 కోట్ల పెట్టుబడులు, 150 ఉద్యోగాలు.
Comments
Please login to add a commentAdd a comment