డైవర్షన్‌ గమనించలేదా? | Five people Ends Life In Konaseema district | Sakshi
Sakshi News home page

డైవర్షన్‌ గమనించలేదా?

Jun 3 2025 12:57 PM | Updated on Jun 3 2025 1:34 PM

Five people Ends Life In Konaseema district

వడిశలేరు వద్ద ట్యాంకర్‌ను ఢీకొన్న కారు

ఐదుగురి దుర్మరణం 

ఇద్దరికి తీవ్ర గాయాలు

కాకినాడ వెళ్లి వస్తూండగా ఘోరం 

రెండు కుటుంబాల్లో పెను విషాదం

అతి వేగమే బలిగొందా?

రంగంపేట/రాజానగరం/రాజమహేంద్రవరం రూరల్‌: అప్పటి వరకూ ఆనంద సాగరంలో ఓలలాడిన వారిన్ని విధి చిన్నచూపు చూసింది.. కొద్దిసేపటిలో ఇంటికి చేరుకునేవారే.. అయినవారితో సంతోషంగా గడిపేవారే.. కానీ, అంతలోనే వారిపై మృత్యువు పంజా విసింది.. రహదారిపై మృత్యుఘోష ప్రతిధ్వనించింది.. రంగంపేట మండలం వడిశలేరు వద్ద ఏడీబీ రోడ్డుపై జరిగిన ఘోర ప్రమాదం రెండు కుటుంబాల్లో ఎప్పటికీ తీరని విషాదాన్ని నింపింది. అయినవారందరినీ శోక సంద్రంలో ముంచింది.

ఏం జరిగిందంటే..
ఈ ప్రమాదంలో మృతి చెందిన ఐదుగురు, గాయ పడిన వారు దగ్గర బంధువులు. రాజానగరం మండలం రఘుదేవపురానికి చెందిన రేలంగి శివన్నారాయణ (40), ఆయన భార్య దేవీ లలిత (34), కుమార్తెలు వర్షిత (13), హర్షితతో పాటు.. రాజమహేంద్రవరం రూరల్‌ మండలం కవలగొయ్యి గ్రామానికి చెందిన శివన్నారాయణ బావమరిది తీగిరెడ్డి శివ (30), ఆయన భార్య భవాని, వారి కుమార్తె సాన్వి (4) కలసి కారులో సోమవారం కాకినాడ బీచ్‌కు వెళ్లారు. 

అక్కడ ఆనందంగా గడిపారు. తిరిగి వస్తున్న క్రమంలో వడిశలేరు గ్రామ సమీపాన హెచ్‌పీ పెట్రోలు బంకు వద్ద వారు ప్రయాణిస్తున్న కారు ఆగి ఉన్న పాల ట్యాంకర్‌ను వేగంగా ఢీకొంది. ఆ వేగానికి కారు సగ భాగం ట్యాంకర్‌లోనికి చొచ్చుకుపోయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న శివన్నారాయణ (40), దేవీ లలిత (34) దంపతులు, వారి కుమార్తె వర్షిత (13), తీగిరెడ్డి శివ (30), ఆయన కుమార్తె సాన్వి (4) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. వెనుక సీటులో కూర్చున్న శివ భార్య భవాని, శివన్నారాయణ కుమార్తె హర్షిత తీవ్రంగా గాయపడ్డారు. 

వారిని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కల్లు గీతపై ఆధారపడి ఈ కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. శివ తండ్రి సూరిబాబు గత ఏడాది తాటిచెట్టు పైనుంచి పడి, మంచాన ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఈ ఘోరం జరగడం ఆయా కుటుంబాలను తీవ్రంగా కలచివేస్తోంది. సరదాగా బీచ్‌కు వెళ్లి వస్తామని చెప్పి వెళ్లిన వారు ఇలా కనుమరుగైపోతారనుకోలేదంటూ మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ప్రమాదంతో రెండు గ్రామాల్లోనూ విషాద ఛాయలు అలముకున్నాయి.

డైవర్షన్‌ గమనించలేదా?
ఏడీబీ రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరిస్తున్నారు. ఈ పనుల నేపథ్యంలో వడిశలేరు హెచ్‌పీ పెట్రోల్‌ బంకు వద్ద అటుగా వెళ్లాల్సిన ట్రాఫిక్‌ను పక్క మార్గంలోకి మళ్లిస్తూ డైవర్షన్‌ ఇచ్చారు. దీనికి కొద్ది దూరంలోనే పాల ట్యాంకర్‌ ఆగి ఉంది. ప్రమాద సమయానికి శివన్నారాయణ కారు నడుపుతున్నారు. ఆయన ఆగి ఉన్న ట్యాంకర్‌ను, డైవర్షన్‌ను గమనించకుండా వేగంగా దూసుకుని రావడం వల్లనే ఈ ఘోరం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జయిపోయింది. 

రహదారిపై డైవర్షన్‌ను గమనించి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండకపోవచ్చని స్థానికులు భావిస్తున్నారు. ప్రమాద స్థలాన్ని జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్‌, అడిషనల్‌ ఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ, అడిషనల్‌ ఎస్పీ (క్రైం) ఎల్‌.అర్జున్‌, రాజమహేంద్రవరం ఈస్ట్‌ జోన్‌ డీఎస్పీ బి.విద్య, అనపర్తి సీఐ సుమంత్‌ సందర్శించారు. మృతదేహాలను రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహాలను చూసి బంధువులు, కవలగొయ్యి, రఘునాథపురం గ్రామస్తులు కన్నీరు మున్నీరయ్యారు. ప్రభుత్వాసుపత్రి వద్ద కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు మిన్నంటాయి. రంగంపేట పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

ఆధార్‌ ఇబ్బందులు తొలగిపోతాయనుకుంటే..
మృతుడు శివన్నారాయణ కుమార్తెలు హర్షిత, వర్షితలు కవల పిల్లలు. 13వ సంవత్సరంలోకి వచ్చారు. ఇద్దరూ ఒకే రూపంలో ఉండటంతో ఆధార్‌ అయ్యేది కాదు. ఈ క్రమంలో కాకినాడలో ఇందుకు సంబంధించిన పని చేసే వారున్నారని వారికి తెలిసింద. బీచ్‌లో సరదాగా గడిపిన అనంతరం వారు హర్షిత ఆధార్‌ పని పూర్తి చేసుకోవాలని వెళ్లారు. తిరిగి వచ్చే సమయంలో ఈ కవలల్లో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. ఆధార్‌ ఇబ్బందులు తొలగిపోతాయనుకుంటే ఇలా జరిగిందంటూ వారి బంధువులు కన్నీటి పర్యంతమవతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement