ఆక్రమణలకు గురయ్యే అవకాశం ఉన్నందున విక్రయిస్తున్నట్టు ప్రభుత్వం జారీ చేసిన జీవో
అనంతపురం జిల్లాలో 6.89 ఎకరాల పుష్పగిరి మఠం భూములు అమ్మకానికి..
అనుమతిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ.. ఆక్రమణలసాకుతో అమ్మకానికి అనుమతిస్తున్నట్లు వెల్లడి
సాక్షి, అమరావతి: ఆక్రమణలకు గురయ్యే అవకాశం ఉందన్న సాకుతో చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలోని దేవదాయశాఖ భూములను అమ్మకానికి పెట్టింది. ఇదే కారణం చూపిస్తూ వైఎస్సార్ కడప జిల్లాలోని పుష్పగిరి మఠం పేరిట అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరు అగ్రహారం గ్రామ పరిధిలోని 259 సర్వే నెంబరులో ఉన్న 6.89 ఎకరాల భూమిని అమ్మేస్తోంది. ఈ భూమి ఆక్రమణలకు గురయ్యే అవకాశం ఉందని, దానిని విక్రయిస్తే వచ్చిన సొమ్మును బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే అధిక ఆదాయం వస్తుందంటూ దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయం గతనెల 11న ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది.
దీంతో.. కేవలం 40 రోజుల వ్యవధిలోనే ప్రభుత్వం కూడా ఆ భూమిని అమ్మేందుకు అనుమతిస్తూ బుధవారం ఆదేశాలు జారీచేసింది. దేవుడి ఆస్తులను పరిరక్షించాల్సిన ప్రభుత్వమే ఇలాంటి ఆదేశాలు జారీచేయడంపై భక్తులు మండిపడుతున్నారు. కట్టుదిట్టమైన చట్టాలు ఉండీ, వాటిని అమలుచేసే భారీ యంత్రాంగం ఉండీ ఆక్రమణలకు అడ్డుకట్ట వేయకుండా ప్రభుత్వమే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఏంటని వారు దుమ్మెత్తిపోస్తున్నారు.
23 నెలల్లో ఇలాంటి నిర్ణయాలెన్నో..
ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం రాష్ట్రంలో దేవదాయ శాఖ పరిధిలో 4.67 లక్షల ఎకరాల భూములుండగా.. వాటిని అస్మదీయులకు కట్టబెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఈ 23 నెలల కాలంలో ఇలాంటి పలు నిర్ణయాలు తీసుకుందని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) వంటి సంస్థలతో పాటు భక్తులు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే..
» సాధారణంగా దేవదాయ శాఖ భూములను వేరొకరు రిజి్రస్టేషన్లు చేసుకోవడానికి వీల్లేకుండా నిషేధిత జాబితాలో ఉంచుతారు. ప్రైవేట్ వ్యక్తుల భూముల నంబర్లు మారి దేవాలయాల భూముల్లో కలిపారంటూ లక్షన్నర ఎకరాల దేవాలయాల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు ఇప్పటికే కసరత్తు చేసినట్లు ఆరోపణలున్నాయి.
» పట్టణ ప్రాంతాల్లో ఉండే దేవాలయాల భూములను 33 ఏళ్ల పాటు ప్రైవేట్ సంస్థలకు లీజుకివ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం జీఓ–139 తెచ్చింది.
» కృష్ణాజిల్లా గొడుగుపేట దేవాలయానికి చెందిన భూమి విజయవాడలోని గొల్లపూడిలో ఉంటే.. ఆ భూమిని ఎగ్జిబిషన్ గ్రౌండ్ కోసం, గోల్ఫ్ కోర్టు కోసం కేటాయించారు. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు ఇందులో రాత్రికి రాత్రి మట్టిని తోలారు. దీనిపై భక్తులు సుప్రీంకోర్టు వరకు వెళ్లి స్టే తెచ్చుకోవాల్సి వచ్చింది.
» అలాగే, కాకినాడ శ్రీభావనారాయణస్వామి ఆలయ భూములను క్రికెట్ స్టేడియం కోసం కేటాయిస్తూ ఆదేశాలిచ్చారు.


