భారీగా పెరుగుతున్నవిద్యుత్ వాహనాల అమ్మకాలు
2025లో వీటి అమ్మకాలు 23లక్షలకు పైనే..
2030 నాటికి ద్విచక్ర వాహనాల్లో 80 శాతం వాటా ఈవీలదే
వేధిస్తున్న చార్జింగ్ స్టేషన్ల కొరత
సాక్షి, అమరావతి: దేశంలో విద్యుత్ వాహనాల అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. 2025లో వీటి అమ్మకాలు 23 లక్షలకు పైగా జరిగాయి. మొత్తం కొత్త వాహనాల విక్రయాల్లో ఇది సుమారు 8 శాతం. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, కాలుష్యంపై అవగాహన, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, కొత్త కంపెనీల ప్రవేశం వంటి కారణాలతో భారత ఈవీ రంగం భారీ మార్పు దిశగా సాగుతోంది. ప్రస్తుతం భారత ఆటోమొబైల్ రంగంలో ఈవీలకు ప్రత్యేక స్థానం ఏర్పడుతోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఆటోలు ఈ మార్కెట్ను ముందుకు నడిపిస్తున్నాయి. భారత్లో ఈవీ మార్కెట్కు ప్రధాన బలం ఎలక్ట్రిక్ టూ వీలర్లు.
మొత్తం ఈవీ అమ్మకాల్లో సగానికి పైగా వాటా వీటిదే. తక్కువ నిర్వహణ ఖర్చు, ఇంధన వ్యయం తగ్గడం, నగర ప్రయాణాలకు అనుకూలత వల్ల ప్రజలు ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలూ గణనీయంగా పెరిగాయి. కంపెనీలు కొత్త మోడళ్లను మార్కెట్లోకి తెస్తున్నాయి. మధ్యతరగతి వినియోగదారులూ ఇప్పుడు ఈవీలపై ఆసక్తి చూపుతున్నారు. 2025లో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 70 శాతానికి పైగా పెరిగినట్టు నివేదికలు చెబుతున్నాయి. విదేశీ కంపెనీలు కూడా భారత్ మార్కెట్పై దృష్టి పెడుతున్నాయి.
చార్జింగ్ స్టేషన్లే సమస్య
విద్యుత్ వాహనాల విక్రయాలు జోరుగా సాగుతున్నా చార్జింగ్ స్టేషన్ల విషయంలో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ప్రస్తుతం దేశంలో కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాలు మాత్రమే చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటులో ముందంజలో ఉండగా, ఏపీతో సహా మిగతా రాష్ట్రాల్లో చార్జింగ్ స్టేషన్ల కొరత వేధిస్తోంది. చైనా నుంచి దిగుమతయ్యే బ్యాటరీ ముడి పదార్థాలపై ఆధారపడటం కూడా పరిశ్రమకు పెద్ద సవాల్గా మారింది. 2030 నాటికి ద్విచక్ర వాహనాల్లో 80 శాతం, కార్లలో 30 శాతం, బస్సుల్లో 40 శాతం ఈవీలుంటాయని అంచనా. ప్రస్తుతం 10 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులుండగా, 2030 నాటికి భారత ఈవీ మార్కెట్ విలువ 100 బిలియన్ డాలర్లకు పైగా ఉంటుందని భావిస్తున్నారు. అలాగే 50 లక్షల వరకు కొత్త ఉద్యోగాలు వస్తాయని నివేదికల్లో వెల్లడైంది.


