మహిళల ఆధ్వర్యంలో పాల సేకరణ కేంద్రాలు

Dairy collection centers under the auspices of women - Sakshi

తొలిదశలో ఉభయ గోదావరి, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో 

సాక్షి, అమరావతి: ‘వైఎస్సార్‌ చేయూత’ పథకం ద్వారా లబ్ధి పొందిన మహిళలతో మొదటి దశలో తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో అమూల్‌ సహకారంతో పాల సేకరణ కేంద్రాలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. ‘వైఎస్సార్‌ చేయూత’ లబ్ధిదారులను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కార్యక్రమంపై తన సహచర మంత్రులతో కలిసి అధికారులతో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, కె.కన్నబాబు, సీదిరి అప్పలరాజు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

► ఈ కార్యక్రమం ద్వారా మహిళలు ఇప్పటికే కొత్తగా 11,270 రిటైల్‌ (కిరాణా) దుకాణాలు ప్రారంభించినట్టు అధికారులు తెలిపారు. 
► అనంత, చిత్తూరు, కృష్ణా, తూ.గోదావరి, విశాఖ జిల్లాల్లో రిలయెన్స్‌ రిటైల్‌ సంస్థ రైతుల నుంచి పండ్లు, కూరగాయలు కొనుగోలు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసిందని అధికారులు వివరించారు. కర్నూలు జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేసి విజయవంతమైన రిలయెన్స్‌ జియో మార్ట్‌ మోడల్‌ ఇతర జిల్లాలకు విస్తరించాలని మంత్రులు ఆ సంస్థ ప్రతినిధులకు సూచించారు. 
► వ్యాపారాలను ప్రారంభించే లబ్ధిదారులు, వ్యాపార దిగ్గజ సంస్థలను అనుసంధానం చేస్తూ సెర్ప్‌ రూపొందించిన ప్రత్యేక మొబైల్‌ యాప్‌ను మంత్రి పెద్దిరెడ్డి ఆవిష్కరించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top